కేజీబీవీల సంఖ్య పెంచాలి 

6 Jun, 2018 01:57 IST|Sakshi

కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరిన కడియం  

సాక్షి, న్యూఢిల్లీ: బాలికా విద్యపై ఏర్పాటైన సబ్‌ కమిటీ (కేబ్స్‌) ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో (కేజీబీవీ) ఇంటర్‌ వరకు విద్యనందించే విషయంలో పాఠశాలల అప్‌గ్రేడేష్‌ను కొన్నింటికే పరిమితం చేయడం సరికాదని, వీటి సంఖ్యను పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉంటే 94 స్కూళ్లలోనే ఇంటర్‌ విద్యనందించేందకు కేంద్రం అనుమతించిందని,  తరగతి గదికి 20 మంది విద్యార్థులనే పరిమితం చేయడం సరికాదని ఆయన వివరించారు. పలు అంశాలపై కడియం మంగళవారం ఢిల్లీలో ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బండ ప్రకాశ్‌లతో కలసి కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు.

అందులో ప్రముఖంగా ఇంటర్‌ వరకు విద్యాబోధనకు కేజీబీవీల సంఖ్యను పెంచడం, గ్రూపుల వారిగా తరగతికి 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాలల అప్‌గ్రేడేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని, ఇంటర్‌ వరకు విద్యాబోధనకు ప్రతి పాఠశాలకు 15 మంది టీచర్ల అవసరం ఉంటుందని, కేంద్రం 9 మందినే నియమిస్తామనడం సరికాదన్నారు. అందులో కూడా క్వాలిఫైడ్‌ టీచర్ల నియమించి, రూ.40 వేల వేతనాలు చెలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7.5 కోట్లు విడుదల చేయాలని, ప్రస్తుతం నిర్ణయించిన వరంగల్‌ జిల్లా మాము నూరు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను ప్రారంభించేందుకు జాతీయ పశువైద్య మండలి అనుమతులిచ్చిన నేపథ్యంలో.. అడ్మిషన్లపై కడియం వెటర్నరీ కౌన్సిల్‌ డైరెక్టర్‌ కరుణ్‌ శ్రీధర్‌తో సమావేశమై చర్చించారు.

మరిన్ని వార్తలు