డబుల్ బెడ్రూంకు పాత ధరలే..

28 Apr, 2016 03:52 IST|Sakshi

ఉత్తర్వు జారీ చేసిన గృహ నిర్మాణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం యూనిట్‌కాస్ట్ విషయంలో తర్జనభర్జన పడ్డ ప్రభుత్వం చివరికి పాత ధరనే ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 ల క్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.7 లక్షలుగా ధరలను ఖరారు చేసింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు, జిల్లాల్లో మరో లక్ష ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటితోపాటు గత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 60 వేల ఇళ్లను కూడా ప్రారంభించాల్సి ఉంది.

వీటన్నింటికీ ఈ యూనిట్‌కాస్టే వర్తించనుంది. టెండర్లకు సరైన స్పందన రాకపోవడంతో యూనిట్ ధరను పెంచాలని అధికారులు ప్రతిపాదించినా.. సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. ఈ పథకం కింద నిర్మించే ప్రతి ఇంటికీ రహదారి, మంచినీరు, విద్యుత్తు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇల్లు ఒక్కో చోట ఉంటే వీటి కల్పన సాధ్యం కానందున కాలనీలుగా ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఆ రూపంలో అయ్యే ఖర్చును ఒక్కో ఇంటి వారీగా విభజించి చివరకు ప్రతి ఇంటికి గ్రామ ప్రాంతాల్లో రూ.1.25 ల క్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు అవసరమవుతాయని నిర్ధారించింది.

మరిన్ని వార్తలు