వివాహేతర సంబంధమే ఉసురు తీసింది

6 May, 2015 23:37 IST|Sakshi
వివాహేతర సంబంధమే ఉసురు తీసింది

గద్వాలటౌన్(మహబూబ్‌నగర్): నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని గద్వాల టౌన్ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఆ దారుణానికి కారణమని తేల్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపిన వివరాలివీ.. మండలంలోని  చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన రాముడు మేస్త్రీ పనిచేస్తుంటాడు. అతని భార్య సుజాతకు గద్వాలకు చెందిన తెలుగు దర్శెల్లి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో చనువుగా ఉంటున్న విషయం తెలుసుకున్న రాముడు పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో అతడిని తమకు అడ్డుగా భావించి అంతమొందించాలనుకున్నారు.

తెలుగు దర్శెల్లి తనకు సన్నితులుగా ఉన్న దౌదర్‌పల్లికి చెందిన జాన్, స్థానిక రాంనగర్‌కు చెందిన వెంకటేష్‌తో కలసి పథకం వేశాడు. దాని ప్రకారం ఈనెల 2వ తేదీ రాత్రి చెనుగోనిపల్లి నుంచి బైక్‌పై రాముడు గద్వాలకు వస్తున్న విషయాన్ని సుజాత ద్వారా తెలుసుకుని, గ్రామ శివారులో మాటువేసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. సమీపంలోని బావిలో రాముడు మృతదేహాన్ని పడవేశారు. ఈనెల 3వ తేదీ ఉదయం సుజాత ఏడుస్తూ భర్త కన్పించడం లేదని బంధువులకు చెప్పగా వారు అనుమానం వచ్చి నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా నేరం అంగీకరించింది. హత్యకు పాల్పడిన ప్రియుడు తెలుగు దర్శెల్లితో పాటు అతనికి సహకరించిన జాన్, వెంకటేష్, సుజాతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు