-

దళితుల అభివృద్ధికి ప్రణాళికలు

20 Sep, 2014 01:26 IST|Sakshi

దళిత బహుజనఫ్రంట్ సదస్సులో వక్తల డిమాండ్
 
హైదరాబాద్: దళితుల సమగ్రాభివృద్ధికోసం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించాలని వక్తలు డిమాండ్‌చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి సవరణలు చేయూలని, దానికున్న పదేళ్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు నిధులు విడుదల చేయూలని వారు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దళిత బహుజనఫ్రంట్ ఆధ్వర్యంలో దళితుల సమగ్రాభివృద్ధిపై నిర్వహించిన రాష్ర్టసదస్సులో పలువురు వక్తలు వూట్లాడారు. వ్యవసాయాధార దళిత కుటుంబాలకు రెండో దశ భూపంపిణీని ప్రారంభించాలని విజ్ఞప్తిచేశారు. సెంటర్‌ఫర్ దళిత్‌స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బడుగు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే పాత్రను దళితసంఘాలు నిర్వహించాలన్నారు. దళిత యువతకు ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అనుగుణంగా గ్రామాల్లో యువతకు ఎలాంటి ఉపాధికావాలి .. దానికి ఏమి చేయాలో సూచిస్తూ నివేదికను సమర్పించాలని కోరారు.

ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి దళితుల అభ్యున్నతికి గట్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 59 దళిత కులాలుండగా చిందోళ్లు, గుర్రపు మాల తదితర దళిత కులాల అభ్యున్నతికి అందరూ కృషిచేయకపోతే చరిత్ర క్షమించదన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన పి.శంకర్ మాట్లాడుతూ అసైన్డ్‌భూముల అన్యాక్రాంతాన్ని అరికట్టాలని, దళితులకు పంపిణీచేసిన భూములను భూసేకరణ చట్టం కింద ప్రజాప్రయోజనాల పేరుతో స్వాధీనం చేసుకోవద్దని కోరారు. ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటుచేసి దానికి మానవ హక్కుల సంఘం తరహాలో జ్యుడీషీయల్ అధికారాలు కల్పించి దళితులపై దాడులను నివారించాలని కోరారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, భూహక్కుల పరిశోధకురాలు  ఉషా సీతాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షుడిగా పి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా బి.మొగులయ్యను ఎన్నుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు