అటు వినోదం.. ఇటు ఆదాయం

9 Aug, 2018 02:27 IST|Sakshi

  ప్రయాణ ప్రాంగణాల్లో మల్టీ, మినీప్లెక్స్‌లు  

  టీఎస్‌ఎఫ్‌డీసీతో ఆర్టీసీ ఒప్పందం 

  అనువైన స్థలాల కోసం పరిశీలన 

  రాష్ట్రంలో 100 మినీప్లెక్స్‌లకు సన్నాహాలు 

మంచిర్యాల అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిక్కెట్టేతర ఆదాయంపై దృషి సారించింది. నష్టాల బాటపట్టిన ఆర్టీసీని లాభాల్లోకి నడిపించేందుకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాణ ప్రాంగణాల్లో మల్టీ, మినీప్లెక్స్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు వినోదాన్ని పంచడంతో పాటు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌డీసీ)తో ఒప్పందం చేసుకుంది. ఆయా బస్‌స్టేషన్లలో ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణాన్ని బట్టి ఒకటి నుంచి రెండు వరకు మినీప్లెక్స్‌లు (చిన్న థియేటర్లు) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వంద థియేటర్లను నిర్మించాలనే సంకల్పంతో టీఎస్‌ఎఫ్‌డీసీ ముందుకు సాగుతోంది. ఇందుకుగాను ఆయా బస్‌స్టేషన్లలో స్థలాలను గుర్తించే పనిలో టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు, ఇతర అధికారులు నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా ఆసిఫాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్‌ బస్‌స్టేషన్లను వారు పరిశీలించారు. అనువైన స్థలాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ థియేటర్‌ నిర్మిస్తే ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందో బేరీజు వేసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల పరిశీ లన తర్వాత ఆర్టీసీతో స్థలాలు లీజుకు తీసుకోవడమా.. లేక పర్సంటేజీ పద్ధతిలో ఒప్పందం చేసుకోవడమా అనేది తేలనుంది. «థియేటర్ల ఏర్పాటు వల్ల ప్రయాణికులు గంటల కొద్ది బస్సుల కోసం వేచిచూడకుండా కాలక్షేపంతో ఊరట పొందవచ్చు. ఈ విషయంపై టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ రామ్మోహన్‌రావు సాక్షితో మాట్లాడుతూ ఇప్పటికే పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని బస్‌స్టేషన్లలో స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. థియేటర్లు లేని ప్రాంతాలతో పాటు అన్ని బస్‌స్టేషన్లలో స్థలాలను పరిశీలించి చిన్న థియేటర్లు నిర్మించనున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు