‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు పదోన్నతులు

22 Dec, 2019 03:36 IST|Sakshi

ఐదుగురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి కావడంలో కీలకపాత్ర పోషించిన ఐదుగురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్‌–1 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బీవీ రమణారెడ్డిని ఎస్‌ఈగా ప్రమోట్‌ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సర్కిల్‌–1 ఎస్‌ఈగా ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చిం ది. ఇప్పటివరకు అక్కడ ఎస్‌ఈగా కొనసాగుతు న్న సుధాకర్‌రెడ్డిని కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా బదిలీ చేసింది. లింక్‌–2లో డీఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్‌కు ఈఈగా, ప్రాజెక్ట్‌ డివిజన్‌–2లో డీఈఈగా పనిచేస్తున్న ఎ.యాదగిరికి ఈఈగా ప్రమోషన్‌ ఇచ్చింది. వారు పనిచేస్తున్న చోటే ఈఈలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లింక్‌–1లో ఏఈఈలుగా పనిచేస్తున్న ఎం.రాజు, పి.రవిచంద్రకు డీఈఈలుగా పదోన్నతి కల్పించారు.

తెలంగాణ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌కు 10(హెచ్‌) పరిధి నుంచి వీరికి మినహాయింపునిచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమోట్‌ అయిన ఇంజనీర్లు ఇన్‌చార్జీలుగానే ప్రస్తుతం ఇచ్చిన పోస్టుల్లో కొనసాగుతారని, పాత క్యాడర్‌లోని పేస్కేల్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. వారికి పదోన్నతులు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్‌చార్జి ఏర్పాట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తుదితీర్పునకు లోబడి ఉంటాయని, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ ప్రమోషన్‌ స్థానాల నుంచి ఇంజనీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ప్రమోషన్‌ పొంది ఇన్‌చార్జీలుగా కొనసాగుతూ ఎవరైనా రిటైర్డ్‌ అయినా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలో ఈ పదోన్నతులను పరిగణనలోకి తీసుకోబోమని, వీటిపై సంబంధిత ఉద్యోగులకు ఎలాంటి అధికారం ఉండబోదని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు