డీసీసీ అధ్యక్షుడిగా రాజేందర్‌రెడ్డి 

8 Feb, 2019 11:56 IST|Sakshi
రాజేందర్‌రెడ్డి

వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాలకు నియామకం

సిటీకి కట్ల శ్రీనివాస్‌

వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ అర్బన్‌–వరంగల్‌ రూరల్‌ జిల్లాల అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 2015లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండో సారి నియమించారు. 2018లో మూడో సారి కూడా రాహుల్‌ గాంధీ రాజేందర్‌రెడ్డినే నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన రాహూల్‌గాంధీ నాలుగో దఫాలో ఆయనను వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే వరంగల్‌ సిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కట్ల శ్రీనివాస్‌ను మరో సారి అదే పదవీ వరించింది. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల  లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియాలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయిని నియామకంపై టీపీసీసీ కార్యదర్శులు ఈ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు