మత సామరస్యానికి ప్రతీక ‘రంజాన్‌’

5 Jun, 2019 13:28 IST|Sakshi

బాన్సువాడ/కామారెడ్డి టౌన్‌: 29 రోజుల ఉపవాసాలు ముగిశాయి. ఇక పండుగే మిగిలింది. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ రంజాన్‌. రంజాన్‌ మాసం మంగళవారం నాటితో ముగియగా, షవ్వాల్‌ మాసంలోని మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్‌–ఉల్‌–ఫితర్‌. మంగళవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో బుధవారం రంజాన్‌ పండుగను జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. ఈ పండుగ ఉమ్మడి జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈద్‌–ఉల్‌–ఫితర్‌ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోని ఈద్‌గా‹లలో ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

 ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్‌. దివ్య ఖుర్‌ ఆన్‌ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేçయడం ద్వా రా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రో ధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపు లో ఉంటాయి. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించిన విధితమే. ఉదయాన్నే అన్న పానాదులను సేవించడాన్ని సహరి అంటా రు. తిరిగి సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనాన్ని సేవించడాన్ని ఇఫ్తార్‌ అంటారు.

ఈద్‌–ఉల్‌–ఫితర్‌ అంటే.. 
నెల రోజులపాటు రంజాన్‌ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్‌ మాసపు మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్‌–ఉల్‌–ఫితర్‌. ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలను ధరించి, ఇతర్‌ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్‌గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ‘ఈద్‌–ముబారక్‌’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. రంజాన్‌ పండగ రోజు షీర్‌ ఖుర్మా అనే తీపి వంటకం అందరినీ నోరూరిస్తుంది. వాతావరణమంతా దైవ విశ్వాసం, దైవ భీతి, దైవ విధేయతా భావాలతో, ఉన్నత నైతిక పోకడలతో, సత్క్రియా, సదాచారాలతో అలరారుతుంది. ఈ వాతావరణంలో చెడు అన్నది అణగిపోతుంది. మంచి అన్నది పెరుగుతుంది. సజ్జనులు సత్కార్యాల్లో సహకరించుకొంటారు. ధనికులు, పేదలు అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దిన చర్యను పాటిస్తారు. తామంతా ఒకే భావన, ప్రేమాభిమానాలు, సమైక్యతా సామరస్యాలు నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ తర్వాత మరో 6 రోజులపాటు షవ్వాల్‌ దీక్షలను పాటిస్తారు.

జకాత్‌: ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్‌ నాలుగోది. జకాత్‌ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి ఇంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్దేశించబడి ఉన్న సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల వెల కట్టి అందులో నుంచి 2.5శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేదే జకాత్, ఫిత్రాల ముఖ్య ఉద్దేశం. అనేక విషయాలు అవగతం: రంజాన్‌తో అనేక విషయాలు అవగమవుతాయి. మనో నిగ్రహం అలవడుతుంది. ఆకలి, దప్పుల విలువ తెలుస్తుంది. దాన గుణం అలవడుతుంది. చెడు అలవాట్లు, కోరికలు దహించబడుతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, రుజువర్తన, కర్తవ్య పారాయరణత, సర్వ మానవ సౌబ్రాతత్వం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి.

సృష్టికర్త, సహృదయంతో మానవాళికి రంజాన్‌ మాసం అందించారు. ఈ మాసంలో ఒక సత్కార్యం చేస్తే ఇతర మాసాల్లో లభించే పుణ్య ఫలం కంటే అత్యధికంగా లభిస్తుంది. ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా తరావీ నమాజ్‌ చేస్తారు. దివ్య ఖుర్‌ ఆన్‌ను రోజుకు 20 రకాతుల చొప్పున తరావీ నమాజులో 27 రోజులపాటు హాఫీజ్‌లు పఠిస్తారు. రంజాన్‌లో రాత్రి పూట ఇషా నమాజ్‌ అనంతరం తరావీ నమాజ్‌ జరుగుతుంది. ఇలా 27 రోజులు తరావీ నమాజ్‌ జరిపిన తర్వాత షబ్‌–ఎ–ఖదర్‌ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. 30 రోజులపాటు ఉపవాస దీక్ష పాటించలేని వారు 27 రోజుల తర్వాత వచ్చే షబ్‌–ఎ–ఖదర్‌ రాత్రి నుంచి ఈద్‌–ఉల్‌–ఫితర్‌ వరకు మూడు రోజులపాటు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇహ లోకంలో ఆచరించే ఇటువంటి కఠో ర దీక్షలు మనల్ని పరలోకంలో రక్షణగా ఉండి కా పాడుతాయని ముస్లింల ప్రగా«ఢ విశ్వాసం. రంజా న్‌ నెలలో ఉపవాసాలతో, దాన ధర్మాలతో గడిపిన వారి ప్రార్థనలను అల్లాహ్‌ ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై అగ్ని సంస్కారం పొందిన బంగారం మాదిరి వారి మోము దివ్య కాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు.  

ఫిత్రాదానం: షవ్వాల్‌ నెల మొదటి తేదీ ఈద్‌–ఉల్‌–ఫితర్‌ çపండుగనాడు నమాజ్‌ ప్రార్థనకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగను ఈద్‌–ఉల్‌–ఫిత్ర్‌ అని పేరు వచ్చింది. షరియత్‌ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాల పరిహారార్థం చేసేదే ఫిత్రా దానం. సమాజంలోని నిరుపేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు కూడా ఇతరులతో పాటు పండుగల్లో మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోదుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లిం దానం చేయాలి.   

మరిన్ని వార్తలు