బాలికా.. నువ్వే ఏలిక

21 Jan, 2019 08:21 IST|Sakshi

ఉత్సాహంగా ‘రన్‌ ఫర్‌ ఏ గర్ల్‌ చైల్డ్‌’

పాల్గొన్న కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వల్‌  

గచ్చిబౌలి: సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్‌ ఫర్‌ ఏ గర్ల్‌ చైల్డ్‌’ పేరిట నిర్వహించిన 5కే రన్‌ ఉత్సాహంగా సాగింది. కార్యకమాన్ని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వల్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల వికాసానికి తోడ్పాటు అందిస్తూ సేవా భారతి ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కితాబిచ్చారు. ‘బేటీ బచావో..బేటీ పడావో’ నినాదంతో ప్రదాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు.

సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్‌ వికాస్‌ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తోందన్నారు. తాను పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళతానని, పర్యావరణ పరిరక్షణకు అందరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం రన్‌లో విజేతలకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వల్, జయేష్‌ రంజన్‌లు బహుమతులు ప్రదానం చేశారు. 

ఉత్సాహంగా రన్‌..
10కే రన్‌ను సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, హెచ్‌సీయూ వైస్‌ చాన్సలర్‌ పి.అప్పారావు ప్రారంభించారు. 21కే రన్‌ను ఏఓసీ సెంటర్‌ కమాండెంట్, బ్రిగేడియర్‌ జేజేఎస్‌ బిందర్, ప్రముఖ జిమ్నాస్ట్‌ మేఘనారెడ్డి ప్రారంభించారు. రన్‌లో 400 మంది సైనికులతో పాటు వివిధ ఐటీ కంపెనీలకు చెందిన 8 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు