-

లాంచీలో సాగర్‌ టు శ్రీశైలం

25 Oct, 2017 15:12 IST|Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌ : తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తొలిసారిగా శ్రీశైలానికి నదీ మార్గం ద్వారా వెళ్లేందుకు బుధవారం లాంచీ ట్రయల్‌ రన్‌ వెళ్లనుంది. లాంచీలు నడవడానికి సాగర్‌ జలాశయంలో సమృద్ధిగా నీరు ఉంది. అధిక శాతం పర్యాటకులు కార్తీక మాసంలో తెలంగాణ నుంచే శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. వారంతంలో, సెలవు దినాల్లో మాత్రమే నాగార్జునకొండకు నాలుగైదు ట్రిప్పులు లాంచీలను నడుపుతున్నారు. మిగిలిన ఐదు రోజులు పర్యాటకులుంటే  కొండకు ఒక ట్రిప్పు వెళ్తుంది. లేకుంటే జలాశయం తీరంలోనే లాంచీలుంటున్నాయి.

పర్యాటక అభివృద్ధి సంస్థ అదనపు ఆధాయాన్ని సమకూర్చుకునేందుకు నదీమార్గంలో శ్రీశైలం రెండు రోజుల టూర్‌ ప్యాకేజీని ప్లాన్‌ చేశారు. జలాశయం తీరం వెంటగల అమ్రాబాద్‌–నల్లమల అడువుల ప్రకృతి సహజ అందాలను ఆస్వాదించడంతో పాటు సెల్‌ఫోన్ల గడబిడ లేకుండా రెండు రోజులు ఆనందంగా గడిపేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలోనే శ్రీశైలం మళ్లిఖార్జునస్వామి దర్శనం రాత్రి బస ఏర్పాటు, మరికొన్ని దర్శనీయ స్థలాలను సందర్శించేందుకు సౌకర్యం కల్పించనున్నారు.  

క్రమంగా పెరుగుతున్న సాగర్‌ నీటిమట్టం
సాగర్‌ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం జలకళతో కళకళలాడుతోంది. మంగళవారం 573.20అడుగులకు చేరింది. 264.6026టీఎంసీలకు సమానం. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు కాగా 312.24 టీఎంసీలకు సమానం. శ్రీశైలం జలాశయం నుంచి గడిచిన 24గంటల్లో 19,635 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.90 అడుగులుండగా 46,852 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  సాగర్‌ జలాశయం నుంచి తాగునీటికోసం మోటార్ల ద్వారా కేవలం 1800క్యూసెక్కులు అక్కంపల్లి జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదన ద్వారా వచ్చే ప్రతినీటిబొట్టును నిల్వ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు