సీనియర్‌ ఐఏఎస్‌ టీఎల్‌ శంకర్‌ కన్నుమూత

27 Dec, 2018 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, భారత విద్యుత్‌ రంగ నిపుణుడు, పద్మభూషణ్‌ టీఎల్‌ శంకర్‌ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1957 సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన శంకర్‌ దేశంలో విద్యుత్‌ (ఎనర్జీ) రంగ నిపుణుడిగా, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ప్రిన్సిపల్‌గా, రాష్ట్ర విద్యుత్‌ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 1975లో ఇంధన విధాన నిర్ణయ కమిటీ సభ్యుడిగా, హిందుస్తాన్‌ పెట్రోలియం బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్సార్‌ శంకరన్‌తో కలిసి చదువుకున్నారు. ఇదిలా ఉండగా విదేశాల్లో స్థిరపడ్డ శంకర్‌ కుటుంబసభ్యులు హైదరాబాద్‌ చేరుకున్నాక శనివారం ఉదయం సాగర్‌ సొసైటీలోని ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలవుతుందని, మహాప్రస్థానంలో తుది కార్యక్రమాలు నిర్వహిస్తామని సన్నిహితులు తెలిపారు.  

సీఎం సంతాపం.. 
టీఎల్‌ శంకర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, శంకర్‌ మృతిపై ఆస్కీ చైర్మన్‌ పద్మనాభయ్య, సీనియర్‌ ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్, కాకి మాధవరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో వివిధ రంగాల అభ్యు
న్నతి కోసం శంకర్‌ చేసిన కృషిని వారు కొనియాడారు.   

మరిన్ని వార్తలు