మట్టి ప్రతిమలే మేలు..!

7 Aug, 2014 00:41 IST|Sakshi
మట్టి ప్రతిమలే మేలు..!

మొయినాబాద్ రూరల్: ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమాళాన్ని అందించిన భారత్‌లో కొన్ని వేల సంవత్సరాలుగా పూరాతన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇవన్ని ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగలే. అయితే ఇటీవలె వచ్చిన ఆధునాతన పద్ధతులతో ఈ సంప్రదాయాలే పర్యావరణానికి కీడు చేస్తున్నాయి. ఒకప్పుడు మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకునేవారు.


 ఆ తరువాత వాటిని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేసినా సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్రమాదకరమైన రసాయనాలతో ఆకర్షణీయ రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తున్నారు. పూజల అనంతరం ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసినా అవి కరగడం లేదు. అంతేకాకుండా ఆ ప్రతిమల్లోని రసాయనాలు చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్నాయి. దీనికి బదులు మట్టి విగ్రహాలనే వాడాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించాయి.

 జీవరాశుల మృత్యువాత
 ప్రతి సంవత్సరం హిందువులు వినాయక పండుగ కోసం రాష్ర్ట వాప్తంగా లక్షల సంఖ్యలో గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తారు. వీటిలో 75 శాతంకుపైగా రసాయన పదార్థాలైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలే ఉంటాయి. అయితే పూజల అనంతరం ఈ విగ్రహాలను సమీపంలోవున్న చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుంటారు.

 ఆ సమయంలో విగ్రహాల తయారీలో ఉపయోగించిన కృత్రిమ రంగులైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాదరసం, సీసం, కాడ్మీయం, క్రోమీయం తదితర రసాయనాలు నీటిలో కలుస్తున్నాయి. దీంతో నీరు, గాలి కాలుష్యమవుతోంది. వీటితో క్యాన్సర్, జీర్ణకోశం, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ రసాయనాలతో చెరువులు, కుంటల్లో వుండే జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇటీవలె మట్టి విగ్రహాల వినియోగం పెరిగిపోయింది.

 మట్టి విగ్రహాల వినియోగం శ్రే యస్కరం
 పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలను వినియోగించడమే శ్రేయస్కరమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. చెరువుల, కుంటల వద్ద లభిం చే బంక మట్టితో వివిధ ఆకారాల్లో విగ్రహాలను చేయవచ్చు. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడే అవకాశముండదు. మట్టితో తయారు చేసే విగ్రహాలు నిమజ్జనం చేసిన వెంటనే నీటిలో సులభంగా కరిగిపోతాయి.

అయితే మట్టితో తయారు చేసిన విగ్రహాలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో పోలిస్తే ఆకర్షణీయంగా కని పించకపోవడంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపడంలే దు. మట్టి విగ్రహాలపై ప్రభుత్వాలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రజలలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ కారణంగా ఏటేటా వాతావరణ కాలుష్యం పెరుతూనే ఉంది. కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకై ప్రజల కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

 మట్టి విగ్రహాల తయారీకి ఓ సంఘం
 ఈ తరుణంలో మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో గతేడాది మట్టి విగ్రహాల తయారీ సంఘం ఏర్పడింది. కె. మంజుల అనే మహిళ ఈ సంఘాన్ని స్థాపించి తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. గతేడాది దాదాపు 6 వేల విగ్రహాలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, ఎంజీసీలకు సరఫరా చేశామని, ఈసారి 10 వేల విగ్రహాలను తయారు చేయనున్నట్లు చెబుతోంది. ఈసారి వినాయక చవితి కోసం మూడు నెలల క్రితమే పనులు ప్రారంభించామని, విగ్రహాల తయారీ కూడా దాదాపు పూర్తయినట్లు వివరించింది. మట్టి విగ్రహాల తయారీ ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని, సర్కారు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తోంది.
 

మరిన్ని వార్తలు