భర్తతో గొడవ... భార్య ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవ... భార్య ఆత్మహత్య

Published Thu, Aug 7 2014 12:40 AM

భర్తతో గొడవ... భార్య ఆత్మహత్య - Sakshi

నాగోలు: ఇల్లు ఖాళీ చేసే విషయంలో భర్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం ఆలేరుకి చెందిన ఎన్.శ్రీకాంత్‌రావుకు ఆమనగల్లు మండలం శెట్టిపల్లికి చెందిన ఎస్.ప్రియాంక (24)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 4 ఏళ్ల కుమారుడున్నాడు. శ్రీకాంత్ ఉద్యోగ రీత్యా నగరానికి వచ్చి హస్తినాపురం అనుపమనగర్‌లో ఉంటున్నాడు. ఇదిలావుండగా, శ్రీకాంత్ తన తల్లిదండ్రుల వద్దకు భార్యను తీసుకెళ్లేందుకు పలుసార్లు ప్రయత్నించాడు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీచేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని నిర్ణయించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య బుధవారం ఉదయం గొడవ జరిగింది. అనంతరం శ్రీకాంత్ తన కొడుకును స్కూల్లో దించేందుకు వెళ్లగా.. ప్రియాంక చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి తలుపు కొట్టగా తెరవక పోవడంతో ఇంటి యజమానికి విషయం చెప్పగా ఆయన శ్రీకాంత్‌రావుకు సమాచారం అందించాడు. శ్రీకాంత్ ఇంటికి వచ్చి వెనుక కిటికీ నుంచి చూడగా.. అప్పటికే ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించింది.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలు రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.  అందులో ‘‘ఇలాంటి భర్తతో సంసారం చేయడం చాలా కష్టం. ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాను. ఇంక నాకు ఓపిక లేదు. నా కుమారుడిని మా అమ్మకు అప్పగించండి’’ అని ప్రియాంక పేర్కొంది. ఇదిలావుండగా.. అల్లుడు అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి అరుణమ్మ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement