స్టాంగ్‌ రూంల వద్ద ఆర్మీతో భద్రత కల్పించాలి: గూడూరు 

12 Apr, 2019 05:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంల వద్ద ఆర్మీ లేదా సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కౌంటింగ్‌కు మరో 42 రోజుల గడువున్న నేపథ్యంలో ఈవీఎంలు ఎలాంటి ట్యాంపరింగ్‌కు గురికాకుండా భద్రంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో కోరారు. స్ట్రాంగ్‌ రూంలలోకి స్థానిక పోలీసులకు ప్రవేశం కల్పించవద్దని, భద్రతను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే వారికి అప్పగించాలన్నారు. హైసెక్యూరిటీ జామర్లను స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన అన్ని పోలింగ్‌ బూత్‌లు, స్ట్రాంగ్‌ రూంల సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలన్నారు.

ఈ ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎంలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని, లేదంటే సీజ్‌ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చినందున ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కేడర్‌తో స్ట్రాంగ్‌రూంల వద్ద విజిలెన్స్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌ కేడర్‌ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే టీపీసీసీ నాయకత్వానికి తెలియపర్చాలని కోరారు. 

మరిన్ని వార్తలు