మళ్లీ కేసీఆరే!

9 Nov, 2018 01:16 IST|Sakshi

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 75% విజయావకాశాలు

ఇండియా టుడే తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు.

తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్‌ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. సర్వే ఫలితాల ఆధారంగా పలు అంశాలను నిపుణుల సహాయంతో విశ్లేషించింది. ఆ వివరాలు..

  • ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ అమలు చేసిన అద్భుత వ్యూహం.
  • ప్రభుత్వ అనుకూలత బలంగా ఉంది.
  • సమాజంలోని అన్ని వర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉంది.
  • కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయి. 
  • కాంగ్రెస్‌– టీడీపీ పొత్తు వారికి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
  • హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తుంది. 

మరిన్ని వార్తలు