సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్పై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము అయ్యాయని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ సారి కూడా కాజీపేట రైల్వేజోన్ రాకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని, స్థానిక ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదని గురువారం పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మునీరాబాద్-మహబూబ్నగర్, మనోహరబాద్-కొత్తపల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తామని కేంద్రం ప్రకటించినా, వాటికీ నామమాత్ర కేటాయింపులే చేసిందని చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదనపు రైళ్ల ఊసే ఈ బడ్జెట్లో కనిపించలేదన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారని సీపీఎం నేత, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు.