టెట్ ప్రశాంతం

23 May, 2016 02:31 IST|Sakshi
టెట్ ప్రశాంతం

పరిశీలించిన కలెక్టర్, ఏజేసీ, రాష్ట్ర పరిశీలకుడు, డీఈఓ
షాద్‌నగర్‌లో ఓఎమ్మార్ షీట్‌ను ఎత్తుకెళ్లిన అభ్యర్థి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ సీ-సెంటర్‌లో
అరగంట ఆలస్యం డెలివరీ అయిన వెంటనే పరీక్ష రాసిన మహిళ
పేపర్-1కు 24,625కు 21,525 హాజరు, 3,100 గైర్హాజరు
పేపర్ -2కు 40,218కు 36,258 అభ్యర్థులు హాజరు, 3,960 గైర్హాజరు

 
పాలమూరు యూనివర్సిటీ/మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు విద్యా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కొన్ని కేంద్రాలలో చెదురు మదురు ఘటనలు మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు గంట ముందే చేరుకోవడం జరిగింది. అభ్యర్థులను పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. జిల్లా మొత్తంలో 171పరీక్ష కేంద్రాలలో పేపర్ 1కు 24,625అభ్యర్థులకు గాను 21,525మంది హజరయ్యారు. 3,100మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. రెండో పేపర్‌కు 40,218మందికి గాను 36,258మంది హజరయ్యారు. 3,960మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును రాష్ట్ర పరిశీలకుడు గోపాల్‌రెడ్డి భూత్పూర్‌లోని పలు సెంటర్స్‌ను పరిశీలించాడు. జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ హైస్కూల్ సెంటర్‌ను కలెక్టర్ టీకే శ్రీదేవి పరిశీలించారు.

జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ బి.రంజిత్‌ప్రసాద్, డీఈఓ విజయలక్ష్మీబాయి ఎప్పటికప్పుడు డిపార్ట్‌మెంటల్, రూట్ అధికారులు, సూపరింటెండెంట్ల ద్వారా తెలుసుకున్నారు.జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యర్థులను రాష్ట్రస్థాయి నుంచి కేటాయించడంతో పరీక్ష కేంద్రం వద్ద వారి పేర్లు లేకపోవడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరీక్ష ఆరగంట అలస్యంగా ప్రారంభమయ్యింది.

నవాబ్‌పేటతో పాటు వనపర్తిలో ఉదయం ప్రారంభమయిన పేపర్ 1పరీక్షలో గైర్హాజరయిన అభ్యర్థుల స్థానంలో ఇతరులకు పేపర్ కోడ్ కేటాయించడం అధికారులను గందరగోళానికి గురి చేసింది. జిల్లా విద్యా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి పరీక్ష సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. షాద్‌నగర్ మండలం మొగిలిగిద్దలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఓఎమ్మార్ షిట్‌ను ఎత్తుకెళ్లాడు. ఆ అభ్యర్థిపై విద్యశాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూత్పూర్‌లో పేపర్-2 రాసేందుకు షాద్‌నగర్‌కు చెందిన మహిళ జెడ్పీ ఉన్నత పాఠశాల సెంటర్‌కు 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.


 పరీక్ష కేంద్రాల ఎదుట పడిగాపులు
 కూతురు, భార్య, అక్క, చెల్లెలు, తమ్ముడు ఇలా కుటుంబ సభ్యులు టెట్ పరీక్ష రాస్తుంటే వారి కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల ఎదుట పడిగాపులు కాశారు. కొంత మంది చిన్నారులను పెట్టుకొని సెంటర్స్ వద్ద పరీక్ష రాస్తున్న తల్లులు ఎప్పుడు బయటకు వస్తారో అంటూ ఎదురు చూశారు. చాలా మంది అభ్యర్థులకు వేరు వేరు ప్రాంతాల్లో సెంటర్స్ పడడంతో చిన్నారులను వెంట తీసుకెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పరీక్ష కేంద్రాల సమీపంలో కనీస వసతలు లేకపోవడంతో పరీక్ష రాయడానికి వెంట వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు