నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష

15 Sep, 2023 02:23 IST|Sakshi

బ్లాక్‌ ఇంక్‌ పెన్నునే వాడాలి

గంట ముందే రావాలి

ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,139 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. 

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్‌–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 
మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్‌–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. 

సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
టెట్‌ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు బాల్‌ పాయింట్‌ బ్లాక్‌ పెన్నులు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌ లేకుండా పరీక్షకేంద్రంలోని ప్రవేశం ఉండదు.

అభ్యర్థులు ఓఎమ్మార్‌ పత్రంలో వివరాలు బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు.

అభ్యర్థుల హాల్‌టికెట్‌లో పేరులో ఏమైనా స్వల్ప అక్షరదోషాలు, వివరాలు సరిగ్గా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్‌టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా లేకున్నా ఫొటో అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించుకోవడంతో పాటు అభ్యర్థి ఆధార్‌ కార్డు, ఇతర ఫొటో ఐడీ కార్డులతో సంబంధిత డీఈఓలను సంప్రదించాలి. వారి అనుమతితోనే పరీక్షకు అనుమతిస్తారు. 

మరిన్ని వార్తలు