హుస్సేన్‌సాగర్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

2 Sep, 2019 07:22 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.  
కర్బాలామైదాన్‌ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదికి అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్ళాల్సిన వారు కవాడిగూడ చౌరస్తా, గాంధీనగర్‌ టి జంక్షన్, డీబీఆర్‌ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళాల్సిన వారు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్యపార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైవర్‌ మార్గాన్ని అనుసరించాలి.
ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని నెక్లెస్‌రోడ్‌ లేదా మింట్‌ కాంపౌండ్‌ వైపు పంపిస్తారు.
తెలుగుతల్లి విగ్రహం జంక్షన్‌ నుంచి సాధారణ వాహనాలను ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని ఇక్బాల్‌ మీనార్‌ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్‌ మిల్స్, చిల్డ్రన్స్‌ పార్క్, సెయిలింగ్‌ క్లబ్, కర్బాలా మైదాన్‌ మీదుగా మళ్లిస్తారు.
గోశాల వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్ళే వాహనాలను డీబీఆర్‌ మిల్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా పంపిస్తారు.

మరిన్ని వార్తలు