తుపాకితో హల్‌చల్ చేసిన ముఠా అరెస్ట్

27 Feb, 2015 19:01 IST|Sakshi

మెదక్ (చేగుంట): తుపాకీతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంటలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గోవిందాపూర్‌కు చెందిన తిట్ల మల్లేశం కొంతకాలం క్రితం ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేపట్టడానికి మధ్యప్రదేశ్ వెళ్లాడు. అక్కడ అమిత్‌సింగ్ అనే వ్యక్తి నుంచి తుపాకి, 9 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటిని సొంతగ్రామంలోని మసీదుపల్లి మల్లేశం, ఉప్పల ఎల్లం అనే ఇద్దరికి అమ్మాడు.

అప్పటి నుంచి వీరు తుపాకీ చూపిస్తూ బాటసారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా అదే మండలంలోని గువ్వలెగి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అడ్డగించి తుపాకీతో బెదిరించి రూ.20 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ముసుగుల్లో ఉన్న వ్యక్తులను గుర్తించిన రమేష్ చేగుంట పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టి వీరిరువురితో పాటు వీళ్లకు తుపాకీ అమ్మిన తిట్ల మల్లేశంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి తుపాకీతో పాటు 8 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు