వరకట్న వేధింపులకు వివాహిత బలి

24 Jun, 2016 19:01 IST|Sakshi

హైదరాబాద్‌ : వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా భర్త మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున మేడిపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దేవరుప్పల్ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కె.గంగారాం(35), పద్మ(30) భార్యాభర్తలు. వీరికి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంత కాలంగా పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని మల్లికార్జున్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దురు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో గంగారాం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

కట్నం కావాలంటూ భార్యను తరుచూ మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడు. రెండు మూడు రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర మనస్థాపం చెందిన పద్మ శుక్రవారం వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. కాలిపోతున్న భార్య పద్మను కాపాడేందుకు గంగారాం దుప్పటి కప్పి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. పద్మ భర్తను గట్టిగా పట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడిక్కడే పద్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గంగారాం 50 శాతం కాలిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు