మహిళపై లైంగిక దాడి.. హత్య !

6 Mar, 2016 02:46 IST|Sakshi
మహిళపై లైంగిక దాడి.. హత్య !
* గుర్తుతెలియని వికలాంగురాలిని చంపేసిన దుండగులు
* రంగారెడ్డి జిల్లా పరిగిలో దారుణం  

పరిగి: గుర్తుతెలియని వికలాంగురాలిపై దుండగులు లైంగికదాడికి పాల్పడి చంపేశారు.  శనివారం ఉదయం 7 గంటలకు పరిగికి చెందిన కొందరు మినీస్టేడియం గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తుండగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల వెనకాల ఓ మహిళ హత్యకు గురైనట్లు గుర్తించారు. చేవెళ్ల డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుడికాలుకు వైకల్యం ఉన్న ఆ మహిళ నీలి రంగు చీర, తెలుపురంగు జాకెట్ ధరించి ఉంది. ఓ పెద్ద బండరాయి ముఖంపై ఉంది.

సమీపంలో కండోమ్ ప్యాకెట్లు ఉండటం.. అక్కడున్న పరిస్థితిని బట్టి మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వయస్సు 40-45 ఏళ్లు ఉండొచ్చన్నారు. హతురాలి ఒంటిపై కడియాలు, మెట్టెలు ఉన్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వివరాలు సేకరించాయి. జాగిలం పరిగిలోని గంజ్‌రోడ్డు, మార్కెట్ యార్డు, బస్‌స్టాండు తదితర ప్రదేశాలు తిరుగుతూ అనంతరం సాయిబాబ  కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు వెళ్లింది.  హత్యకు గురైన మహిళ వారం రోజులుగా పరిగిలోనే తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
 
మరిన్ని వార్తలు