మహిళ దారుణ హత్య

17 Jul, 2014 03:09 IST|Sakshi
మహిళ దారుణ హత్య

కొత్తకోట రూరల్ : జాతీయ రహదారి నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాణిపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి తన పొలానికి వెళ్లగా ఓ మహిళ వివస్త్రగా పడిఉండటం గమనించాడు.

 వెంటనే రైతు సర్పంచు బాలయ్యకు ఫోన్‌చేసి చెప్పాడు. ఆయన కొత్తకోట పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి డీఎస్పీ శ్రీనువాస్‌రావు, కొత్తకోట సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐలు రాఘవేందర్, గోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. దుండగులు మహిళను అత్యాచారం చేసి అతి దారుణంగా తలపై బండరాయితో మోది హతమార్చారు.

 అంతటితో ఆగకుండా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ వయసు సుమారు 25 నుండి 30 ఏళ్లలోపు ఉండవచ్చని, మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలో బీరుసీసాలు, వాటర్‌ప్యాకెట్లు పడి ఉన్నాయి. పరిసర ప్రాంతంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తువులు ఎక్కడా కనిపించలేదు. హత్య చేసిన వారు తెలివిగా బట్టలను మాయం చేశారు. మృతి చెందిన మహిళ గృహిణియా, ఇంకెవరైనా  అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్‌బాబు తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన వాటర్ ప్యాకెట్లు గద్వాల ప్రాంతం జమ్మిచెడ్ ప్రాంతంలో తయారైనట్టు గుర్తించామని, మృతురాలెవరో గుర్తిస్తే కేసు ఛేదించడం సులభమవుతుందని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు