ఆడపిల్లల మనసు అర్థం చేసుకోండి

20 Jan, 2019 08:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘బాల్యవివాహాలు చేయకండి.. ఆడపిల్లల మనసు అర్థంచేసుకోండి.. రోజూ ఏడ్చుకుంటూ వుండలేను...అందుకే వెళ్లిపోతున్నా... అందరూ నన్ను క్షమించండి...’ అంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ గాయత్రిపురంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన నర్సయ్య, లక్ష్మి దంపతుల కూతురు గీతాంజలి (26)కి ఖడెం మండలం లక్ష్మీపురానికి  చెందిన శంకర్‌తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 

శంకర్‌ మహారాష్ట్రలో ప్రయివేటు లెక్చరర్‌గా చేస్తుంటాడు. శనివారం సాయంత్రం గీతాంజలి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గీతాంజలి రాసిన ఏడు పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్న తనంలోనే వివాహం చేయటం.... అర్ధం చేసుకోలేని భర్త...చదువుకుని ఉద్యోగం చేయాలన్న కల నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌  వల్ల అర్ధం అవుతుందని పోలీసులు తెలిపారు. సూసైడ్‌ నోట్‌ చివర తన పేరు గీతాంజలి, ఐపీఎస్‌ అని వ్రాసింది, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు