మరోసారి ఝలక్‌ ఇచ్చిన ఈటల

14 Sep, 2019 12:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ వైఖరి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రి కొద్దికాలం మౌనంగా ఉన్నా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు  తిరిగి శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓఎస్డీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు ఈటల రాజేందర్‌కు మధ్య ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన ఈటెల.. ఎమ్మెల్యే గాదారి కిషోర్‌తో కలిసి వెళ్తున్నారు. ఈ సమయంలోనే అక్కడున్న దేశపతి.. మీతో రావచ్చా సర్‌ అంటూ రాజేందర్‌ను పలకరించే ప్రయత్నం చేశారు. దీనికి స్పందించిన మంత్రి ఇప్పుడు నా అవసరం మీకేముందయ్యా అంటూ ఊహించని రీతిలో సమాధానమిచ్చారు. దీంతో దేశపతి​ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈటల సమాధానమిన్న అక్కడి వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో రాజేందర్‌ వ్యాఖ్యలు మరోసారి టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
చదవండి: బీఏసీకి దూరంగా ఉండనున్న ఈటల, ఎర్రబెల్లి

వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలో అసంతృప్తి
కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం ఉగ్రరూపం దాల్చి.. ఎవరో ఫోన్ చేస్తే సాయంత్రానికి చల్లబడడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేతలు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదన్నారు ‘‘తాజ్‌మహల్‌కు రాళ్లెత్తినోళ్లు ఓనర్లు కారని ఎమ్మెల్సీ నారదాసు అన్నారు. అలా అనడం శ్రామిక వర్గాన్ని అవమానించడమే. ఈ విషయం ఆయనకు కూడా చెప్పాను. జర్నలిస్టులు ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలను మరింత చైతన్యవంత చేయాలి’ అని పేర్కొన్నారు.

రచ్చ చేసుకోవద్దు: ఎమ్మెల్యే భాస్కర్ రావు 
అందరికి పదవులు కావాలంటే సాధ్యం కాదు. పదవులు కోరి రాకుంటే బాధ ఉండటం సహజం. మనలో ఎవరికి వచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.. అరికపూడి గాంధీ మంత్రి పదవి కావాలి అనుకున్నాడు. గాంధీని తుమ్మల నాగేశ్వరరావు, నేనూ ఇంటికి పిలిచి గట్టిగా మందలించాము. ఇప్పుడు అంతా సద్దుమణిగింది.. మాలో ఎవరికొచ్చినా ఒకటే. జిల్లాలో అందరిని కలుపుకుపోవలని చెప్పాము. విప్ పదవి పట్ల గాంధీ హ్యాపీగా లేరు. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వతంతో చర్చించి.. పరిష్కరించుకోవాలి. కానీ రచ్చ చేసుకోవద్దు.

ప్రగతి భవన్‌లోకి అనుమతిపై.. 
ప్రగతి భవవన్‌లోనికి అనుమతించక పోవటంపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. ‘గవర్నర్ నరసింహన్‌ వీడ్కోలు సమావేశానికి నాకు ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయబోయి పొరపాటున ఫోన్ నాకు వచ్చింది. ఆ విషయం తెలియక నేను ప్రగతి భవన్ కు వెళ్ళాను. ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన అన‍ంతరం నాకు విషయం తెలిసింది. జరిగిన పొరపాటులో వాళ్ళ తప్పేమీ లేదు. తలసాని సాయికిరణ్ మంత్రి తలసాని కుటుంబ సభ్యుడుగా వెళ్లి ఉంటారు’ అని వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు