12 నిండు ప్రాణాలు.. 14 గంటల పోరాటం

4 May, 2017 08:00 IST|Sakshi

బీజింగ్: తక్కువ సమయంలో అధ్బుత నిర్మాణాలు చేపట్టడంలో చైనీయులది అందెవేసిన చెయ్యి. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులు ఎక్కువగా చనిపోయే దేశం కూడా చైనాయే. అక్కడే ఏటా సగటున 66 వేల మంది కార్మికులు పని ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కొనసాగింపు అన్నట్లు.. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే టన్నెట్ పేలిపోవడంతో 12 మంది కార్మికులు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి చైనాలోని గిజావు ఫ్రావిన్స్ లో మంగళవారం చోటుచేసుకుందీ ఘటన.

భారీ టన్నెల్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తోన్న కార్మికులు నిర్మాణ శిధిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సుమారు 2వేల మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 14 గంటల పోరాటం తర్వాత మొత్తం 12 మృతదేహాలను వెలికితీయగలిగారు. ప్రమాదం ఎలా జరిగిందనే కారణం తెలియాల్సిఉందని, దర్యాప్తు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే చైనా సుమారు 17 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు