సినిమాను కాపాడండి- సీనియర్‌ నటుడు

6 Jun, 2017 12:18 IST|Sakshi
సినిమాను కాపాడండి- సీనియర్‌ నటుడు
 
తమిళసినిమా: సినిమాను కాపాడండి అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీకి నటుడు కమలహాసన్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విధానం (జీఎస్‌టీ) జూలై 1న అమల్లోకి రానుంది. కాగా జీఎస్‌టీ పన్ను విధానాన్ని కోలీవుడ్‌ సినీ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఈ విషయం పునఃపరిశీలించి పన్ను శాతాన్ని తగ్గించని పక్షంలో తాను సినిమాను వదిలేస్తానని నటుడు కమలహాసన్‌ ఇటీవల దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. 
 
కాగా జీఎస్‌టీ పన్ను విధానాన్ని తాము తప్పు పట్టడం లేదని, సినిమా టిక్కెట్లపై ఈ పన్ను విధానంతో 28శాతం అదనంగా భారం పడుతుందని, దీంతో ప్రాంతీయ భాషా చిత్రాలకు తీవ్ర ముప్పు కలుగుతుందని కమలహాసన్‌ అన్నారు. ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్‌ను వేడుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ సినిమాను కాపాడాలని  కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీకి విజ్ఞప్తి చేశారు. 
మరిన్ని వార్తలు