గురుగ్రామ్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి నగ్న ఫొటోలు తీసిన కేసులో బీసీఏ విద్యార్థిని (21) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హరియాణాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది.
కొన్ని నెలల క్రితం బీసీఏ విద్యార్థి అమిత్ కుమార్కు ఫేస్బుక్ ద్వారా ఓ యువతి (22) పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. గత మంగళవారం ఆ యువతి అమిత్ కుమార్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అమిత్ కుమార్ తప్ప ఎవరూ లేరు. అమిత్ కూల్ డ్రింక్ ఆఫర్ చేయగా ఆమె తీసుకుంది. అయితే డ్రింక్లో మత్తు పదార్థం కలపడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. అమిత్ ఆమె దుస్తులు తొలగించి తన సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి రాగా, అమిత్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, వారితో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.