టెర్మ్ పాలసీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి

4 Nov, 2013 01:52 IST|Sakshi
టెర్మ్ పాలసీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి

 నా వయసు 46 సంవత్సరాలు. 2005వ సంవత్సరం జూలై నుంచి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏడాదికి రూ.15,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. 20 ఏళ్ల పాటు ఇలా పెట్టుబడులు పెట్టాలని మొదట్లో అనుకున్నాను. అయితే ఈ పాలసీ ఏమంత మంచిది కాదని మిత్రులంటున్నారు. ఈ పాలసీ సరెండర్ వాల్యూ రూ. 1,35,000. ఈ పాలసీని రద్దు చేసుకొని మరో ఉత్తమమైన పాలసీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి?                                     -ప్రకాష్, నందిగామ

 మీరు పాలసీ పేరును స్పష్టంగా పేర్కొనలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ పాలసీ యూనిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్) అయిండవచ్చు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన పాలసీ యూలిప్ అయితే మీరు మీ పాలసీని సరెండర్ చేయవచ్చు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ల కలగలుపు పథకంగా యూలిప్‌ను పరిగణించవచ్చు. కానీ బీమాకు ప్రత్యేకంగా ఒకటి, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా మరొకటి తీసుకోవడమే సరైన విధానం. మీరు కొంచెం రిస్క్‌ను భరించగలిగితే, మా వెబ్‌సైట్‌లోని ఫండ్ సెలెక్టర్ టూల్ ద్వారా ఫైవ్-స్టార్ రేటెడ్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక  మీ పాలసీని సరెండర్ చేస్తే బీమా రక్షణ కోల్పోతారు. అందుకని మీ కుటుంబానికి పూర్తి ఆర్థిక భరోసానిచ్చే టెర్మ్ పాలసీని తీసుకోండి. మీరే కాదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెర్మ్ పాలసీని తీసుకోవాలి.  అవి అధిక కవరేజ్‌ని ఇస్తాయి. ప్రీమియం తక్కువగా ఉంటుంది.

 ఎస్‌బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్‌లో ప్రతి నెలా రూ.1,000 చొప్పున ఏడు నెలల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ నాకు భారీగా నష్టాలొస్తున్నాయి. ఈ ఫండ్‌లోనే పెట్టుబడులు కొనసాగించమంటారా? వేరే ఫండ్‌లోకి మళ్లించమంటారా? తగిన సలహా ఇవ్వండి?

 - ఆనంద్, సికింద్రాబాద్

 మిడ్ అండ్ స్మాల్‌క్యాప్ కేటగిరీలోని ఎస్‌బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్ ఫండ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్‌లో పెట్టుబడులు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతాయి. చాలాసార్లు వాటి విలువ బాగా క్షీణిస్తూ ఉంటుంది కూడా. కానీ దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం ఉంటుంది. ఈ కేటగిరీ ఫండ్స్ కనీస పెట్టుబడి కాలం ఐదేళ్లు, అంతకు మించి ఉండాలి. ఈ ఫండ్ అసెట్స్ ఏడాది కాలంలో రెట్టింపయ్యాయన్న విషయాన్ని గమనించాలి. గత కొన్ని నెలలుగా ఈ ఫండ్ ప్రతికూల ఫలితాలనిస్తోంది. కానీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఇన్వెస్ట్ చేసి ఏడు నెలలే అయింది. ఒక ఈక్విటీ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఇది చాలా తక్కువ సమయం.  ఈ ఏడు నెలలుగా మీకు వచ్చిన నష్టాలకు మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, మీరు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం. స్వల్పకాలిక ఒడిదుడుకులను తట్టుకోగలిగి, మీరు ఇన్వెస్ట్ చేసే సొమ్ములు మీకు తక్షణం అవసరం లేని పక్షంలో ఈ ఫండ్‌లో కనీసం ఐదేళ్లు పెట్టుబడులు పెట్టండి. లేదంటే డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిది.

 భారత మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా నుంచి నిధుల ప్రవాహం పెరిగిపోతోంది.  ఈ నేపథ్యం లో మ్యూచువల్ ఫండ్స్ లాభపడతాయా? ఇన్వెస్టర్లు అధిక ఎన్‌ఏవీ పొందగలరా?

 - పద్మజ, గుంటూరు

 అక్టోబర్‌లో ఎఫ్‌ఐఐలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు పెడితే మార్కెట్లు

పెరుగుతాయి. మార్కెట్లు పెరిగితే ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుంది. మ్యూచువల్ ఫండ్‌ల ఎన్‌ఏవీలు కూడా పెరుగుతాయి. అయితే ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేం. ఎఫ్‌ఐఐల పెట్టుబడులతోనే మన మార్కెట్లు పెరుగుతున్నాయి. కానీ నాణ్యతపరమైన మెరుగుదల మాత్రం కాదు. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల వల్లే మ్యూచువల్ ఫండ్స్ ఎన్‌ఏవీలు కూడా పెరుగుతున్నాయనేది కాదనలేని సత్యం. భారత్‌లోని ఇన్వెస్టర్లలో అధిక భాగం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయనంతవరకూ, మన మార్కెట్లు ఎఫ్‌ఐఐల మీదనే ఆధారపడతాయి. వాళ్లు పెట్టుబడులు పెడితే పెరుగుతాయి. వారు నిధులు ఉపసంహరించుకుంటే, మార్కెట్లు కుదేలవుతాయి.

 

 

 

 

మరిన్ని వార్తలు