ట్రంప్ దెబ్బకు ఆ విమానానికి బుకింగ్స్ కరువు

9 Mar, 2017 15:42 IST|Sakshi
ట్రంప్ దెబ్బకు ఆ విమానానికి బుకింగ్స్ కరువు
బెర్లిన్ : ట్రంప్ దెబ్బకు ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ కు బుకింగ్స్ కరువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఒరిజినల్ ట్రావెల్ బ్యాన్ అనంతరం తమ బుకింగ్స్ 35 శాతం పడిపోయాయని  ఎమిరేట్స్ విమానయాన సంస్థ అధ్యక్షుడు టిక్ క్లార్క్ చెప్పారు. జనవరి నెలలో ట్రంప్ ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రయాణికులకు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం విదితమే. అనంతరం ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. నిరసనకారులు విమానశ్రయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. అనంతరం మళ్లీ ట్రావెల్ బ్యాన్ పై కొత్త ఆర్డర్లను ట్రంప్ జారీచేశారు. ఈ సారి ఆరు దేశాలపైనే వేటువేసి, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.  ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన వెంటనే ఈ ప్రభావం తమ సంస్థపై పడిందని క్లార్క్ చెప్పారు.
 
గత నెలలో భారతీయుడిపై కాన్సస్ లో జరిగిన విద్వేషపూరిత దాడి కూడా తమ ఎయిర్ లైన్స్ కు దెబ్బకొట్టినట్టు  పేర్కొన్నారు. ప్రస్తుతం బుకింగ్స్ రికవరీ అవుతున్నాయని, కానీ ఆశించని స్థాయిలో లేదన్నారు. యథాతథ స్థితికి వస్తాయో లేదో కూడా అనుమానమేనని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఎనిమిది రోజుల్లోనే అమెరికాకు వెళ్లే ప్రయాణికుల శాతం కూడా 6.5 శాతం తగ్గినట్టు ట్రావెల్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ కీస్ సోమవారం రిపోర్టు వెలువరిచింది. నిషేధ దేశాల ప్రయాణికులను, అమెరికాను కలుపుతూ ప్రయాణించే ప్రధాన విమానసంస్థ ఎమిరేట్సే. దుబాయ్ హబ్ ద్వారా ఇది ప్రయాణిస్తోంది. నిషేధ దేశాలకు, అమెరికాకు ప్రస్తుతం డైరెక్ట్ గా ఎలాంటి విమానాలు లేవు. 
 
>
మరిన్ని వార్తలు