ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సస్పెండయ్యారు!

3 Jul, 2015 16:03 IST|Sakshi
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సస్పెండయ్యారు!

''దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర'' లాంటి డైలాగులు పండిన ఎన్నో తెలుగు సినిమాలకు స్ఫూర్తి, ముంబై అండర్ వరల్డ్ను గజగజ వణికించిన ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఎస్ఐ దయానాయక్ను మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2012లో మళ్లీ సర్వీసులోకి వచ్చిన దయానాయక్పై విచారణ పెండింగులో ఉంది. ఈలోపు ఆయనను నాగ్పూర్ బదిలీ చేయగా, ఆయన అక్కడ చేరలేదు. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు.

1995 బ్యాచ్ అధికారి అయిన దయానాయక్ దాదాపు ఆరున్నరేళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఆయనపై మాజీ పాత్రికేయుడు కేతన్ తిరోద్కర్ ఏసీబీకి ఫిర్యాదుచేశారు. దాంతో ఏసీబీ 2006 సంవత్సరంలో ఆయనను అరెస్టు చేసింది. అయితే, 2009లో నాయక్ మీద ఆరోపణలకు ఆధారాలు లేవంటూ నాటి డీజీపీ ఎస్ఎస్ విర్క్ అన్ని కేసుల నుంచి విముక్త కల్పించారు. అలాగే దయాపై పెట్టిన మోకా కేసును కూడా 2010లో సుప్రీంకోర్టు కొట్టేసింది.  

2012లో దయాను మళ్లీ పోలీసు దళంలోకి తీసుకున్నా, ఆయుధాల విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆయనను బాంద్రా నుంచి అంధేరి వరకు ఉండే వెస్ట్ రీజియన్కు బదిలీ చేశారు. నాయక్ తన పదవీకాలంలో వినోద్ మట్కర్, రఫిక్ డబ్బా, సాదిక్ కాలియా లాంటి దాదాపు 80 మందికి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేశారు. ఆయన తుపాకి గుళ్లకు బలైనవాళ్లలో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు