ప్రభుత్వ పాలనే కీలకం

20 Sep, 2015 02:46 IST|Sakshi
ప్రభుత్వ పాలనే కీలకం

దీనిపై అభ్యర్థులు లోతుగా అధ్యయనం చేయాలి
 
గ్రూప్-1 మూడో పేపర్‌లో దీనిపై ప్రత్యేక యూనిట్
గ్రూప్-2, గ్రూప్-3ల్లోనూ ప్రశ్నలు
పాలనలో విలువలపైనా ప్రత్యేక చర్చ
‘సాక్షి’తో టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ భూపతిరావు
 
సాక్షి, హైదరాబాద్: ‘సమాజంలో పాలనే ప్రధానం. ప్రజా సంక్షేమానికి పథకాలు రూపొందించాలన్నా.. రూపొందించిన పథకాలను అమలు చేయాలన్నా పాలనా వ్యవస్థ తప్పనిసరి. ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుంది. లేదంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన వ్యవస్థది కీలక పాత్ర. అందుకే ఏ పోటీ పరీక్షలోనైనా పాలనకు సంబంధించిన ప్రశ్నలు కచ్చితంగా ఉంటాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న వివిధ పోటీ పరీక్షల్లోనూ పాలనపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఒక యూనిట్‌గా సిలబస్‌లో చేర్చింది. గవర్నెన్స్ పేరుతో ఉన్న మూడో సెక్షన్‌లో పాలనకు సంబంధించిన సమకాలీన అంశాలపై అభ్యర్థులకు అవగాహన ఎంతో అవసరం.
 
 సమాజ, సామాజిక సమస్యలు, ప్రజలు, వారి జీవన విధానంపట్ల అవగాహన లేని వారు అధికారులైతే పాలన సరిగ్గా చేయలేరు. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ పాలనపట్ల కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ భూపతిరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన అంశంపై అభ్యర్థులు సిద్ధం కావాల్సిన తీరు గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
 సంపూర్ణ అవగాహన అవసరం..
 సమాజం, ప్రభుత్వ పాలన ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సమాజంలో ప్రజలు కీలకమైతే పాలనలో అధికారులు, ఉద్యోగులే కీలకం. ప్రజా సంక్షేమం కోసం పాలన ను పక్కాగా కొనసాగించాలంటే వారికి పాలనపట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. అందుకే గ్రూప్-1 సిలబస్‌లో ఈ అంశాన్ని చేర్చాం. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3లో ఇండియన్ సొసైటీ, కాన్‌ిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాలన (గవర్నెన్స్) ఒక యూనిట్‌గా 50 మార్కులకు ఉంటుంది. ఇక గ్రూప్-1 ప్రిలిమినరీలోనూ 13 అంశాలు ఇస్తే అందులో 9వ అంశంగా భారతదేశంలో పరిపాలన, ప్రభుత్వ విధానం గురించి ఉంటుంది. గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లోనూ తెలంగాణ రాష్ట్ర విధానాల అంశంలో దీని గురించి ఉంటుంది. అలాగే పేపర్-2 మూడో విభాగంలో సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్‌లో పాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఉంటాయి. ఇందులో రెండో విభాగంలోనూ ఓవర్‌వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్‌ిస్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఐదో అంశంలో గ్రామీణ పట్టణ పాలనలో 73, 74 రాజ్యాంగ సవరణల ప్రభావం గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
 ఐదు విభాగాలపై దృష్టిపెట్టాలి...
 గ్రూప్-1 పేపర్-3లో మూడో యూనిట్‌గా గవర్నెన్స్ ఉంటుంది. అందులో ఐదు ప్రధాన విభాగాలు ఉంటాయి. వాటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి
 
 1. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ-గవర్నెన్స్ తదితరాలు ఇందులో కేంద్ర స్థాయిలో పాలన వ్యవస్థ ఏ విధంగా వ్యవస్థీకృతమైందన్న అంశంపై అవగాహన ఉండాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్, సర్వీస్ కమిషన్, కాగ్ తదితర) వాటి పని తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్షన్ కమిషన్, కాగ్ వంటివి శాసన వ్యవస్థపై చూపుతున్న ప్రభావం, వాటి పనితీరును విశ్లేషించగలగాలి. వాటికి సంబంధించిన నేపథ్యం, వాస్తవాలు తెలుసుకోవాలి. కేంద్ర మంత్రి మండలి, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం, మంత్రి మండ లి సచివాలయం, కేంద్ర సచివాలయం, వివిధ శాఖలు, వాటి పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్ వంటి), యూపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ, మహిళా జాతీయ కమిషన్లు, వాటి పని తీరు, ప్రభావం గురించి ఇందులో ఉంటాయి. పార్లమెంటరీ కమిటీలు, ఎస్టిమేట్స్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు, సాధించిన ప్రగతికి సంబంధించిన కీలక అంశాలను విశ్లేషించాలి.
 
 2. రాష్ట్ర స్థాయిలో పాలనా వ్యవస్థ ఎలా వ్యవస్థీకృతమైందన్నది తెలుసుకోవాలి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో పాలన ఎలా ఉంది, జిల్లా కలెక్టర్ల పాత్ర ఏమిటి, సచివాలయం, డెరైక్టరేట్లు ఏం చేస్తాయి, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న దానిపై విశ్లేషించాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారు పని తీరు ఎలా ఉందన్నది తెలియాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం విధులు ఏమిటి,  పాలనపై లెజిస్లేటివ్ నియంత్రణ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్ నియంత్రణ, జ్యుడీషియరీ నియంత్రణపట్ల అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పాలనాపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారత, ఆహార భద్రత వంటి పథకాలపైనా దృష్టి పెట్టాలి. కోఆపరేటివ్ విధానాలు ఏమిటి...వాటి పూర్వాపరాలను విశ్లేషించాలి. రాష్ట్ర స్థాయిలో ప్రధాన సంక్షేమ పథకాలు ఏమిటన్న అవగాహన ఉండాలి. ప్రస్తుతం అధికారాలన్నీ కేంద్ర స్థాయిలో ఉన్నాయి. బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రజలకు ఆ ప్రయోజనాలు ఎలా అందుతున్నాయి.. అధికార వికేంద్రీకరణ ఎలా కొనసాగుతోందన్నది విశ్లేషించాలి.
 
 3. ప్రధానంగా 73, 74 రాజ్యాంగ సవరణల తరువాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ సంస్థలు ఎలా పని చేస్తున్నాయి... 73, 74 రాజ్యాంగ సవరణల ఫలితాలు, ప్రయోజనాలు ఏమిటన్నది రాయగలగాలి. వాటి ప్రభావాన్ని విశ్లేషించాలి. స్థానిక సంస్థల పరిస్థితి ఏమిటి... వాటికి నిధులు ఎలా సమకూరుతున్నాయి... ప్రజా సమస్యల పరిష్కారంలో వాటి కృషి ఏమిటన్నది చెప్పేలా పరీక్షలకు సిద్ధం కావాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, ప్రయోజనాలు తెలియాలి. సామాజిక అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని వివరించాలి. వాటి పనితీరు,  ఫలితాలపై అవగాహన ఉండాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వ కృషి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
 
 4. అభివృద్ధి, వివిధ అభివృద్ధి ప్రక్రియలపై చర్చించేలా అవగాహనను పెంపొందించుకోవాలి. సివిల్ సొసైటీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లు, పీపీపీ విధానం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలను విశ్లేషించాలి. సమాజ అభివృద్ధిలో ఎన్జీవోలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల పాత్ర ఏమిటన్నది తెలుసుకోవాలి. ప్రస్తుతం మరో ప్రధాన అంశం పీపీపీ విధానం. సమస్యలను కేవలం ప్రభుత్వమే పరిష్కరించలేదు కాబట్టి రోడ్లు, రైలు రంగాలను తీసుకుంటే.. పీపీపీ విధానంలో రోడ్లు వేయడం, మెట్రో రైలువంటి ప్రాజెక్టులు ప్రధానమైనవి ఈ కోవలోకే వస్తాయి. ప్రత్యేకంగా సామాజిక అభివృద్ధికి పారిశ్రామిక, వ్యాపార వర్గాల భాగస్వామ్యంపైనా విశ్లేషించాలి.
 
 5. ప్రభుత్వ పాలనలో నైతిక విలువలు మరో ప్రధాన అంశం. ప్రభుత్వ పాలనలో స్మార్ట్ గవర్నెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చేదే స్మార్ట్ గవర్నెన్స్. అధికారంలో ఎవరున్నా రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారులు, ఉద్యోగులు తటస్థంగా ఉండాల్సిందే. ప్రజా సంక్షేమం కోసం
 ప్రభుత్వ విధానాలను అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో సరిగ్గా అవగాహన లేక ప్రస్తుతం నాయకులు, అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సందర్భాలున్నాయి. వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చని విశ్లేషించాలి. అవినీతిని ఎలా నిరోధించాలి.. అవినీతి నిరోధానికి ప్రస్తుతం ఉన్న లోకాయుక్త, ఏసీబీ, కన్జూమర్ ప్రొటెక్షన్ మెకానిజం, లోక్‌పాల్ వంటి వాటి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు, అధికారులు- రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలన్నది చెప్పగలగాలి. సత్సబంధాలు లేకపోతే జరిగే నష్టాలను విశ్లేషించాలి. ఎథిక్స్ అండ్ వ్యాల్యూస్‌లో పబ్లిక్ సర్వెంట్‌గా వ్యవహరించే వ్యక్తికి ఉండాల్సిన అంకితభావం, విలువలు, నైతికత గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే లోకాయుక్త ప్రభావం, ఏసీబీ పనితీరు, లోక్‌పాల్ పరిస్థితి వాటి పని తీరుపై విశ్లేషించమని అడిగే అవకాశం ఉంటుంది.
 
 ఏం చదవాలంటే..
 ప్రభుత్వ పాలనకు సంబంధించి తె లుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ముద్రించిన పుస్తకాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సిస్టం ఇన్ ఇండియా అనే పుస్తకం కూడా బాగుంటుంది. వీటితోపాటు జనరల్ బుక్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్, ఇతర వార్తాంశాలు, సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి.
 

మరిన్ని వార్తలు