అత్తగారి హత్యకేసు.. ఎన్నారై మహిళకు విముక్తి

2 May, 2014 13:22 IST|Sakshi

తన అత్తగారిని హత్యచేసిన కేసులో ఎన్నారై మహిళను అమెరికా జైలు నుంచి విడుదల చేశారు. 2012లో జరిగిన ఈ హత్య.. కేవలం మొదటి డిగ్రీ  హత్య మాత్రమేనని భావించడంతో ఆమెను కాలిఫోర్నియాలోని సట్టర్ కౌంటీ జైలు నుంచి విడుదల చేశారు. తన గర్భంలో ఉన్నది ఆడ శిశువని తెలియడంతో తన అత్త బల్జీత్ కౌర్ అబార్షన్ చేయించాలని చూసిందని, అందుకే ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని నిందితురాలు బల్జీందర్ కౌర్ తన న్యాయవాది మని సిద్ధు ద్వారా కోర్టుకు తెలిపారు. 2012 అక్టోబర్ 24న ఈ హత్య జరిగింది. తన అత్తగారు తనకు అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిందని, అయితే అక్కడ తాను నిరాకరించానని బల్జీందర్ కౌర్ చెప్పారు.

లింగవివక్షతో తన గర్భస్థ శిశువు అంతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కౌర్ పోరాడారని, లేనిపక్షంలో పదికోట్ల మంది భారతీయ గర్భస్థ శిశువుల్లాగే ఈమె శిశువు కూడా మరణించి ఉండేదని సిద్ధు వాదించారు. ఏప్రిల్ 25న బల్జీందర్ కౌర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఉండగానే ఆమె తన రెండో కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమెను తాము నిర్దోషిగా కాక.. నేరం చేయలేదని భావించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 15న విచారణ ప్రారంభమై ఏడు రోజుల్లో ముగిసింది.

>
మరిన్ని వార్తలు