మైల్వార్‌లో మాయరోగం..!

18 Aug, 2015 00:48 IST|Sakshi
మైల్వార్‌లో మాయరోగం..!

నిల్చున్న చోటే కిందపడిపోతున్న గ్రామస్తులు
 

బషీరాబాద్: ఓ గ్రామంలో ఒక్కరోజు వ్యవధిలోనే పదిమందికి పైగా అకస్మాత్తుగా కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దానం బస్వరాజ్, కుర్వ నరేశ్, కుమ్మరి రాములు, కందనెల్లి అంజిలమ్మ, యాదప్ప, గర్దన్ భీమప్పలతోపాటు మరో ఏడుగురు శనివారం నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బస్వరాజ్ సోమవారం బాగానే ఉన్నాడు. స్థానికులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కిందపడి పోయాడు. దీంతో ఆయన నోట్లో నుంచి మూడు పళ్లు రాలిపోయాయి. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు అస్వస్థతకు గురై మంచంపట్టారు. సోమవారం గ్రామానికి వచ్చిన ఏఎన్‌ఎంకు స్థానికులు ఈ విషయం తెలిపారు. వైద్యులకు సమాచారం ఇస్తేనే వైద్యం చేస్తామని ఆమె చెప్పారు.
 
కల్తీ కల్లేనా..?
 కాగా, ఈ గ్రామంలో విక్రయిస్తున్న కల్లు తాగి కొందరు మూర్ఛ వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దయ్యం పడుతోందని కొందరు, చేతబడి అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటితే జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు