భర్తను నరికి.. శవాన్ని మూటగట్టి..

18 Aug, 2015 08:20 IST|Sakshi
భర్తను నరికి.. శవాన్ని మూటగట్టి..

శివ్వంపేట: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో భర్తను నరికి చంపిందో భార్య. శవాన్ని మూటకట్టి ఆటోలో తరలించేందుకు యత్నిస్తూ పట్టుబడింది. మెద క్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ఎర్రోల్ల చెంద్రయ్య (50) రైతు. ఆయన భార్య రేణుక.. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక.. సోమవారం గొడ్డలితో చంద్రయ్య తలపై మోది హతమార్చింది.

శవాన్ని సంచిలో మూటకట్టి ప్రియుడి సాయంతో ఆటోలో తరలించేందుకు పథకం వేసింది. బియ్యం తీసుకెళ్లాలంటూ ఆటోను అద్దెకు మాట్లాడింది. ఆటోలో బియ్యం సంచులతోపాటు మృతదేహం ఉన్న సంచిని వేస్తుండగా అందులో నుంచి రక్తం కారసాగింది. గమనించి ఆటోడ్రైవర్.. గ్రామస్తులకు తెలిపాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు అనుమానంతో మూటవిప్పి చూడగా చంద్రయ్య మృతదేహం బయటపడింది. ఈ సమాచారం అందుకున్న శివ్వంపేట ఎస్సై రాజేష్‌నాయక్ రేణుకను పోలీస్టేషన్‌కు తరలించారు. ఆమె ప్రియుడు పరారయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు.
 
 

>
మరిన్ని వార్తలు