వివాహితపై సామూహిక అత్యాచారం

6 Nov, 2013 04:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వే అప్‌యార్డులో మంగళవారం ఓ ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఈడిగ గ్రామానికి చెందిన వివాహిత (27) హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లడానికి సోమవారం రాత్రి పిడుగురాళ్లలో రెలైక్కింది.  రైలు విజయవాడకు చేరుకున్న తర్వాత రాజమండ్రికి ప్యాసింజర్ రైలులో వెళ్లే ఉద్దేశంతో డీజిల్ మల్టీ యూనిట్ (డీఎంఈ) ఎక్కి కూర్చుంది. ఈలోగా రైలును శుభ్రపరిచే నిమిత్తం అప్ యార్డుకు తరలించారు. రైలు వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు రైలు డ్రైవర్‌కు మొరపెట్టుకోగా ఇటువంటి సంఘటనలు సహజమని అతనికి సహకరించాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. రైలులోనే పడిఉండగా క్లీనింగ్ సిబ్బంది తనను పొదల్లోకి తీసుకువెళ్లి వారు కూడా అత్యాచారం చేసినట్లు వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

 చిన్నారిపై బాలుడి అఘాయిత్యం
 ఖమ్మం: అయిదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు(13) లైంగిక దాడి చేశాడు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలోని చిన్నారి మంగళవారం పక్కింటికి వెళ్లింది. ఆ ఇంటిలోని బాలుడు చాక్‌లెట్ ఇస్తానంటూ చిన్నారిని లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిసేపటి తరువాత చిన్నారి ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు తీవ్రంగా రక్తస్రావమవడాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, బాలుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.


 కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్
 చిలుకూరు: పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడిపై నల్లగొండ జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమిక విచారణ జరిపించిన అనంతరం పీఈటీ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో జగదీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు