రావెల కడుపున కీచకుడు

6 Mar, 2016 03:04 IST|Sakshi
రావెల కడుపున కీచకుడు

సాక్షి, హైదరాబాద్:  ‘తండ్రేమో అసైన్డు భూములను యథేచ్ఛగా దోచుకుంటున్నాడు... కొడుకు సుశీల్‌అమ్మాయిలను చెరబడుతున్నాడు.. మంత్రి కడుపున కీచకుడు పుట్టాడు.. తక్షణమే రావెల కిషోర్‌బాబును ఏపీ మంత్రివర్గం నుంచి తొలగించాల’ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సహచర ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పుష్ప శ్రీవాణితో కలసి మాట్లాడారు. తాము మొదట్నుంచీ గిరిజనులనే మంత్రిగా నియమించాలని కోరుతున్నా పట్టిం చుకోలేదన్నారు. దళితుడైన రావెలను మంత్రిని చేయడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

ఇప్పటికైనా మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కొడుకు కీచక పర్వాన్ని దృష్టిలో ఉంచుకుని రావెలను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నారు. తక్షణమే రావెల కొడుకును అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.  ఓవైపు ఎన్టీఆర్ జలసిరి అని గొప్పలు చెప్పుకొంటున్నారని, మరోవైపు గిరిజన గ్రామాల్లో తాగునీరే లేదన్నారు. చంద్రబాబు, చినబాబు అవినీతిలో నిండా మునిగిపోయారని, ఇక ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తారన్నారు. వైఎస్ జగన్ జెండా, అజెండాపై గెలిచిన ఎమ్మెల్యేలను కోట్లు గుమ్మరించి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు నీచబుద్ధి బయటపడిందని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.  
 
తక్షణం అరెస్టు చేయాలి: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఏపీ మంత్రి తనయుడు రావెల సుశీల్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం ఆమె బంజారాహిల్స్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో బాధితురాలు ఫాతిమా బేగంను పరామర్శించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కేసు విషయంపై ఆరా తీశారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వెల్లడించారు.
 
సుశీల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
మద్దతే ముస్లిమ్స్ అసోసియేషన్ డిమాండ్

ముస్లిం మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మద్దతే ముస్లిం అసోసియేషన్ అధ్యక్షులు మోమిన్‌బాష డిమాండ్ చేశారు. సుశీల్ చర్యకు నిరసనగా హైదరాబాద్‌లోని సైనిక్‌పురి సాయినగర్‌లోని అసోసియేషన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. మద్యం సేవించి ఓ ముస్లిం మహిళ చేయి పట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోమిన్‌బాష పేర్కొన్నారు. సుశీల్‌పై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు