రేపు తేలనున్న అద్వానీ భవితవ్యం!

18 Apr, 2017 20:29 IST|Sakshi
రేపు తేలనున్న అద్వానీ భవితవ్యం!

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీలకు విముక్తి లభిస్తుందా లేక నిందితులుగా విచారణ ఎదుర్కొంటారా అన్నది బుధవారం తేలనుంది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్‌ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేసు విచారణలో వీళ్లను నిందితులుగా ఉంచాలా లేదా అన్న విషయాన్ని రేపు సుప్రీం కోర్టు నిర్ణయించనుంది.

ఈ నెల 7న ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో అద్వానీ, జోషీలతో పాటు కేంద్ర మంత్రి ఉమా భారతి, వినయ్‌ కటియార్‌, అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. కరసేవకులపైన ఒక కేసు, మసీదు కూల్చివేతకు ప్రేరేపించారని నాయకులపై మరో కేసు నమోదు చేశారు. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. కాగా సీబీఐ ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  
 

మరిన్ని వార్తలు