ఆస్పత్రిలో వద్దన్నారు..ఆటోలోనే ప్రసవించింది!

22 Apr, 2017 18:30 IST|Sakshi

రాజమహేంద్రవరం: ఆమె పేరు రాములమ్మ(25). నిండు గర్భిణి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఈమె శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో వెళ్లింది. ఒంట్లో నలతగా ఉందని, కాన్పు వచ్చేలా ఉందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పుకుంది. కానీ, వారు ఆమె మాటలను లక్ష్యపెట్టలేదు. 'ప్రసవానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉందిలే.. వెళ్లిపో..' అంటూ వెనక్కి పంపేశారు.

ఇబ్బంది పడుతూనే తిరిగి ఆటో ఎక్కిన రాములమ్మ ఒక్కసారిగా కూలబడిపోయింది. ఆటోలోనే బిడ్డను ప్రసవించింది. ఆస్పత్రి ఆవరణలోనే ఇంత జరుగుతున్నా పట్టించుకోని సిబ్బందిపై అక్కడున్న జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేలుకున్న సిబ్బంది.. తల్లితోపాటు శిశువును లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు