చిన్న జిల్లాలతోనే ప్రగతి

18 Oct, 2016 00:49 IST|Sakshi
చిన్న జిల్లాలతోనే ప్రగతి

అభిప్రాయం
ప్రపంచబ్యాంకు ఈ మధ్యనే విడుదల చేసిన గణాంకాలనుబట్టి ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల నిరుపేదలు ఉంటే వారిలో 22.4 కోట్లమంది ఇండియా లోనే ఉన్నారు. 2030 సంవత్సరానికల్లా పేదరికం నుంచి వీరిని విముక్తి చేయాలని లక్ష్యం. ఇప్పటికే గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 80 లక్షల ఇళ్లు కట్టించినప్పటికీ ఇళ్లులేని నిరుపేదలు ఇంకా ఉన్నారంటే ఎక్కడో లెక్క తప్పిందన్నమాటే. తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, అర్హు లైన ఉపాధ్యాయులు గ్రామగ్రామాన ఉన్నప్పటికీ 60శాతం మంది ప్రైవేటు విద్యనే కోరుకుంటున్నారు. వైద్య పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.

జిల్లా కేంద్ర హాస్పిటల్స్‌లో సదుపాయాలు ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో దూరా భారంవల్ల అవి అలంకారప్రాయంగానే ఉన్నాయి. పైగా, పేద ప్రజలకు ఏ విషయంలోనైనా స్థాని కంగా న్యాయం జరగనప్పుడు జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ లేదా జిల్లా స్థాయి అధికారి దగ్గరికి పోవాలంటే చాలా ప్రయాస పడాల్సి వస్తోంది. కొన్ని అర్బన్ జిల్లాలు కాకుండా అన్నీ అభివృద్ధి సాధించగలగాలి. ఇందుకోసం ప్రతి జిల్లా జనాభా కూడా 7-12 లక్షలు ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఇవి చిన్న జిల్లాలుగా ఉన్నప్పటికీ స్మార్ట్ జిల్లాలుగా ఆవిర్భవిస్తాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును ఈ నేపథ్యంలోనే చూడాలి. స్మార్ట్ జిల్లాల వల్ల కలిగే సదుపా యాలను ఒకసారి విశ్లేషిద్దాం.
 
ప్రతి జిల్లా దాదాపు 8-10 లక్షల జనాభా ఉండటం వల్ల జిల్లాలో 2.5-3 లక్షల కుటుంబాలు ఉంటాయి. మనకు ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ప్రతి కుటుంబం వివరాలు, వారి ఆర్థిక, విద్య, ఉద్యోగ పరిస్థితులు, ఇతర స్థితిగతులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, అందవలసిన సంక్షేమ పథకాల గురించిన వివరాలు ప్రతి జిల్లా కలెక్టర్, మినిస్టర్, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి కావల్సిన వివరాలు, ప్రతి కుటుంబాన్ని ప్రకృతి బాటలో నడపటానికి తీసుకో వాల్సిన కార్యాచరణ తయారు చేయడానికి అవసరమైన స్మార్ట్ గవర్నెన్స్‌కు దోహదపడుతుంది.
 
కొన్ని కేంద్ర పథకాల కోసం జిల్లాల సంఖ్య ఆధారంగానే నిధులను విడుదల చేస్తారు. జిల్లా హాస్పిటల్స్ ఆధునీకరణ, నవోదయ విద్యాలయాలు, నేషనల్ హెల్త్ మిషన్ పథకం, జిల్లా కేంద్రీకృత సంస్థలు... ఇలా వివిధ రకాల సంస్థల నిధులు జిల్లాల సంఖ్యనుబట్టే ఉంటాయి. కాబట్టి అధిక జిల్లాలు ఉండటం ఉపయోగకరం.
 
జిల్లా పెద్దదిగా ఉన్నప్పుడు చాలా సందర్భాలలో ఎక్కడ ఏం జరుగుతుందో సకాలంగా, సరిగ్గా తెలుకోవడం కష్టం. పెట్టిన పెట్టుబడికి తగినంత ఫలితం రాదు. మనం పెట్టే ప్రతి పైసా వలన ప్రజలకు ప్రతిఫలం అందాలి. కేంద్ర, రాష్ట్ర పథకాలు, నియోజక వర్గ అభివృద్ధి నిధులు, కలెక్టర్ నిధులు, మినిస్టర్ల నిధులు ఇలా అన్ని ఆర్థిక వనరులను సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా అంచెలంచెలుగా అభివృద్ధి పనులు అమలు చేసుకుంటూపోతే, కచ్చితంగా ప్రగతి పరుగులు పెడుతుంది.

ఏ విషయంలోనైనా సరే పర్యవేక్షణ లేకుండా ఫలితం రాదు. మొన్నటివరకు జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామానికి వెళ్లాలంటే కనీసం 2-3 గంటలు పట్టేది. కానీ కొత్త జిల్లాలన్నీ 50 కిలోమీటర్ల లోపలే ఉండటంవల్ల జిల్లా అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటన చేయడానికి వీలుపడు తుంది. దానివల్ల ఇటు ఉద్యోగులు, అటు అభివృద్ధి పనుల పర్యవేక్షణ సులభమవుతుంది. చిన్న జిల్లాలు డిజిటల్ గవర్నెన్స్‌కు అనుకూలంగా ఉంటాయి. ప్రతి కుటుంబ వివరాలు, ప్రభుత్వ స్థలాలు, అడవులు, వివిధ విభాగాల ఆఫీసులు, అక్కడ పనిచేస్తున్న అధికారుల వివరాలు, ప్రతిరోజూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్టికను పరిశీలించడం వీలవుతుంది.
 
తీపిలేని పాయసం, పంతంలేని పోటీ ఇంపుగా ఉండవు. అలానే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉండటంవల్ల వాటిమధ్య పోటీతత్వం అందరికీ మంచిది. ఉదాహరణకు చెట్ల పెంపకం, భూగర్భ జలాల పెంపు, అక్షరాస్యత, వందశాతం బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతం, ప్లాస్టిక్ వాడకం నిర్మూలన, వందశాతం హాస్పిటల్ డెలివరీ, ఇలా అనేక అంశాలపై ఒక సూచిక ఏర్పాటు చేసుకొని జిల్లాల మధ్య పోటీ పెడితే వాటి అభివృద్ధికి తోడ్పడుతుంది.  చిన్న జిల్లాలు చేయడానికి ప్రధాన కారణం సూక్ష్మ పరిపాలన. ఈ సూక్ష్మం గమనిస్తే తెలంగాణ అభివృద్ధికే కాదు, కొందరి అనుమానాలకు కూడా మోక్షం దక్కుతుంది.

బి. నర్సయ్య గౌడ్ ఎంపీ, బోనగిరి 
ఈమెయిల్ : drbnarsaiah@yahoo.com

మరిన్ని వార్తలు