సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్‌:​​​ విజయసాయిరెడ్డి

3 Nov, 2023 15:34 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో  ఆయన పార్టీ సోషల్‌ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో  సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.

రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్‌ఫ్లూయెన్సర్లకు సూచించారు. 

మరిన్ని వార్తలు