పరీక్ష ఒకటి.. పేపర్‌ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?

24 Aug, 2023 09:33 IST|Sakshi

ఆదిలాబాద్‌: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్‌డీఎల్‌సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు.

పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్‌ హిస్టరీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్‌ కంట్రోలర్‌ నరేందర్‌ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు