వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే..

28 Oct, 2023 07:58 IST|Sakshi

తెల్లకల్లు దుకాణంలో ఘటన..

కత్తితో వ్యక్తిపై దాడి..

కేసు నమోదు చేసిన పోలీసులు!

సాక్షి, ఆదిలాబాద్‌: లోకేశ్వరం మండలంలోని గడ్‌చాంద గ్రామంలో గురువారం రాత్రి ఒకరిపై కత్తితో దాడిచేయగా గాయాలయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ వివరాల ప్రకారం... గడ్‌చాంద గ్రామానికి చెందిన గొల్ల సంజీవ్‌ బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. సంజీవ్‌ భార్యకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. మూడేళ్లుగా గల్ఫ్‌ నుంచి పంపించిన డబ్బుల విషయమై భార్యను ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం చెప్పలేదు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ కాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మరింతగా అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో తన భార్యకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులన్నీ వాడుకున్నాడని శ్రీనివాస్‌పై అనుమానం పెంచుకుని గురువారం రాత్రి తెల్లకల్లు దుకాణంలో ఉండగా కత్తితో దాడిచేశాడు. గాయాలపాలైన శ్రీనివాస్‌ను లోకేశ్వరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం శ్రీనివాస్‌ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌ పంపినట్లు ఎస్సై పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు