AP: జాబ్‌మేళాకు 210 కంపెనీలు

7 May, 2022 08:22 IST|Sakshi

దాదాపు 26,300 ఉద్యోగాల భర్తీ

పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారికి అవకాశం

నేడు, రేపు జాబ్‌మేళా

ఏఎన్‌యూ/పాత గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో శని, ఆదివారాల్లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 26,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని వివరించారు.  మేళాలో పాల్గొనేందుకు ‘వైఎస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌లో ఇప్పటికే 97 వేలమంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారికి ఈ జాబ్‌మేళాలో అవకాశం కల్పిస్తున్నామన్నారు.అర్హతలను బట్టి ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకైనా హాజరుకావచ్చని చెప్పారు. 
 
గత రెండు జాబ్‌మేళాల్లో 30,473 మందికి ఉద్యోగాలు 
ప్రభుత్వపరంగా ఇస్తున్న ఉద్యోగాలతోపాటు అర్హత, ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్‌ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 347 కంపెనీలు పాల్గొని మొత్తం 30,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పారు. జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు రానివారికి ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉపాధి సంబంధిత శిక్షణ ఇచ్చి మళ్లీ జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేవరకు జాబ్‌మేళాల నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు.  ఏఎన్‌యూలో జాబ్‌మేళా కోసం రిజిస్టర్‌ చేసుకున్న వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ముందుగా యూనివర్సిటీ మెయిన్‌ ఎంట్రన్స్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌లో స్కాన్‌ చేయాలని చెప్పారు. స్కాన్‌ చేయగానే.. ఏ బ్లాక్‌లో ఏయే ఉద్యోగాల ఇంటర్వ్యూలు అన్న వివరాలు తెలుస్తాయన్నారు. డైరెక్షన్‌ ఆప్షన్‌ నొక్కితే అక్కడికి ఎలా వెళ్లాలో తెలుస్తుందని, బ్లాక్‌ ఇన్‌చార్జి అన్నది ప్రెస్‌చేస్తే ఆయన పేరు, ఫోన్‌ నంబరు వివరాలు, కంపెనీల జాబితాను ప్రెస్‌చేస్తే ఏ బ్లాక్‌లో ఏ కంపెనీల ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నది తెలుస్తుందని వివరించారు.  

మరిన్ని వార్తలు