AP: అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగాలే ఉద్యోగాలు

24 Oct, 2023 08:20 IST|Sakshi

ఇప్పటికే 1.20 లక్షల మందికి ఉద్యోగాలు

నిర్మాణంలో ఉన్న కంపెనీలకు మరో 1.80 లక్షల మంది అవసరం

అచ్యుతాపురం (అనకాపల్లి): రాష్ట్రంలోని యువతకు మంచిరోజులొచ్చాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఇప్పటికే అక్కున చేర్చుకున్న అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. రానున్న రోజుల్లో కనీసం 1.80 లక్షల మందికి ఉద్యోగాలు/ఉపాధి కల్పించేందుకు ఇక్కడి ఎస్‌ఈజెడ్‌ జోన్‌లో కర్మాగారాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో 5,400 ఎకరాల భూమి సెజ్, నాన్‌ సెజ్‌ కింద సేకరించారు.

అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన బ్రాండిక్స్, ఏషియన్‌ పెయింట్స్, లా రస్, యకోహహాతో పలు బ్రాండెడ్‌ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వివిధ రకాల కోర్సులు పూర్తి చేసిన వారికి అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. సిఫారసులు లేకుండా క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. లారస్‌ విస్తరణలో భాగంగా 1,800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొద్ది నెలల్లో మరో 2 కంపెనీలకు శంకుస్థాపన జరగనుంది.

వీటిలో 1,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో నిర్మాణాలు పూర్తయి కార్యకలాపాలు జరుగుతున్న కంపెనీలు 450 కాగా.. వీటిలో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మరో 223 కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిద్వారా అదనంగా మరో లక్షల 80 వేల ఉద్యోగాలు రానున్నాయి. డిప్లమో, డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కార్మికులకు వైద్య సేవలందించే ఈఎస్‌ఐ ఆస్పత్రికి స్థలం కేటాయింపు జరిగింది.
చదవండి: కాల్‌చేస్తే ‘సరి’..

మరిన్ని వార్తలు