AP CMRF: టీడీపీ నేత కుమారుడికి ప్రభుత్వం పునర్జన్మ

1 Feb, 2022 03:35 IST|Sakshi
ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడను సత్కరించిన రామకృష్ణ కుటుంబ సభ్యులు

క్యాన్సర్‌ బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అండ

కోలుకొని క్షేమంగా ఇంటికి చేరిన యువకుడు

ఎమ్మెల్యే పొన్నాడను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం  

ముమ్మిడివరం: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమారుడికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఆదుకుంది. సకాలంలో డబ్బులు అందజేసి యువకుడిని కాపాడింది. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా టి.కొత్తపల్లికి చెందిన టీడీపీ నేత నక్కా రామకృష్ణ కుమారుడు దిలీప్‌ సదన్య(18) బోన్‌ కేన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

కుమారుడి వైద్య ఖర్చుల కోసం రామకృష్ణ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.7.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ సొమ్ముతో నెల రోజుల కిందట హైదరాబాద్‌లోని సిటిజన్‌ హాస్పిటల్‌లో దిలీప్‌కు వైద్యం చేయించారు. అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఇంటికి క్షేమంగా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో నక్కా రామకృష్ణ కుటుంబసభ్యులు సోమవారం ఎమ్మెల్యే పొన్నాడను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం చేసిన ఈ సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.  

మరిన్ని వార్తలు