విజయవాడలో మళ్లీ కాల్‌మనీ కలకలం.. పోలీసుల సీరియస్‌

17 Aug, 2022 15:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీ 'కాల్‌' నాగులు పడగవిప్పారు. అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ప్రజల రక్తం పీలుస్తున్నారు. నగరంలో ఓ టీడీపీ కార్పొరేటర్‌ కుమారుడు సొంత పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నాడు. 61వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ దుర్గ కొడుకు ధనశేఖర్‌.. ఫణికుమార్‌ అనే వ్యక్తికి రూ.50వేలు అప్పుగా ఇచ్చి ఇప్పటివరకూ రెండున్నర లక్షలు వసూలు చేశాడు.
అంతేకాక బాధితుడు ఫణికుమార్‌ భార్యను సైతం వేధించాడు. టీడీపీ నేతల కాల్‌మనీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ధనశేఖర్‌ను అరెస్ట్‌ చేసి.. 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ధనశేఖర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.


బాధితుడు ఫణికుమార్‌

బాధితుడు ఫణికుమార్‌ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కోసం దశాబ్దకాలంగా పనిచేశాను. టీడీపీ కార్యక్రమాలకు ఉచితంగా ఫోటోలు తీశాను. అయినప్పటికీ తీసుకున్న రూ.50 వేలకు రెండున్నర లక్షల వరకు వడ్డీ కట్టాలని వేధించారు. విడతల వారీగా చాలా సొమ్ము చెల్లించాము. నా భార్యని సైతం అనేక విధాలుగా వేధించారు. టీడీపీ నేత ధనశేఖర్ వేధింపులు తాళలేక నా భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. వాళ్లు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని నాకు తెలుసు. ధనశేఖర్ బాధితులు చాలామంది ఉన్నారు. అందరూ త్వరలోనే బయటకు వస్తారు అని బాధితుడు ఫణికుమార్‌ తెలిపారు.

చదవండి: (‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) 

మరిన్ని వార్తలు