కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్‌

21 Sep, 2022 17:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామన్నారు. ఈ మూడేళ్లలో 98.4 శాతం హామీలు అమలు చేశామన్నారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చలో సీఎం మాట్లాడుతూ, మూడేళ్లలో ఒక్క మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరవేనన్నారు. కరవు, బాబు ఇద్దరూ కవలలు అని సీఎం అన్నారు.
చదవండి: ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ: సీఎం జగన్‌ 

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, వాగులు,వంకలు కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో 5 ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ, రైతులకు అత్యధికంగా సాగునీరు అందుతుంది. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగింది. రైతులే కాదు.. రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారని సీఎం అన్నారు.

‘‘ఈ 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశాం. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాం. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు అందించాం. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాస్తవ సాగుదారులకే బీమా రక్షణ కల్పిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘బాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదు. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నాం. రైతులకు వడ్డీ రాయితీ నవంబర్‌లో అందిస్తాం. మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలు రైతులకు మనమే చెల్లించాం. రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని బాబు వాగ్ధానం చేశారు. రుణమాఫీ చేయకుండ బాబు రైతులను దగా చేశారు. చివరికి రైతులకు సున్నా వడ్డీని బాబు ఎగ్గొట్టారు’’ అని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చారు. బాబు లాంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని సీఎం జగన్‌ మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పెద్ద విప్లవాత్మక మార్పు. నీతి ఆయోగ్‌, ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థల నుంచి ఆర్భీకేలకు ప్రశంసలు వచ్చాయి. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు ఆర్బీకేల సాయం అందుతుందన్నారు.

‘‘ఆర్బీకేల పరిధిలోకి కిసాన్‌ డ్రోన్లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. మోటార్లకు మీటర్లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎక్కడా ఏ రైతు నుంచీ రూపాయి వసూలు చేయలేదు. చేయం, చేయబోం అని సీఎం స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్లతో నాణ్యమైన విద్యుత్ అందించగలమన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉంటున్నాం’’ అని సీఎం అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాయం అందిస్తున్నాం. రైతుల కుటుంబాలకు పరిహారం రూ.7 లక్షలు అందిస్తున్నాం. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నాం. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని సీఎం జగన్‌  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు