గవర్నర్‌ ప్రసంగం వేళ టీడీపీ రసాభాసా.. మండిపడ్డ చీఫ్ విప్‌ శ్రీకాంత్ రెడ్డి

7 Mar, 2022 13:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించిన వేళ.. సభలో టీడీపీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. గవర్నర్‌ను అగౌరవపర్చేలా టీడీపీ వ్యవహరించింది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్‌ నుంచి మాట్లాడారు. 

ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో రుజువైందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.  ‘‘గవర్నర్‌ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా!.  ఆయన వయసును కూడా చూడకుండా వ్యవహరించారు. అసలు బడ్జెట్ పత్రాల్లో ఏముందో కూడా వారు చూడకుండా చించేశారు. గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడి చేసినట్టే!. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు ఎంతో‌హుందాగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ఆ పని చేయట్లేదు. సంస్కార హీనులుగా వ్యవహరించడం టీడీపీ నేతలకు ఎంత వరకు సమంజసం’’ అని ప్రశ్నించారు.

రైతుల ముసుగులో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారాయన. టీడీపీ నేతలు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. బీఏసీ లో అచ్చెన్నాయుడు వ్యవహారశైలి చూశాం. వారు సభని కొనసాగించ కూడదన్నట్టే ఉన్నారు. సభను, వ్యవస్థలను అగౌరవపరచవద్దని టీడీపీ వారికి చెప్తున్నాం’ అని విజ్ఞప్తి చేశారు గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

మరిన్ని వార్తలు