వారి చేతిలో చనిపోయిన పోలీస్ కుటుంబాలను పట్టించుకోరా?: హైకోర్టు
‘నక్సలైట్లు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. అటువంటి వారికి మద్దతుగా పిటిషన్లు ఎలా వేస్తారు? ఇలాంటి పిటిషన్ల విషయంలో తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ల చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయారు. ఆ పోలీసుల కుటుంబాల కోసం ఎవరైనా హైకోర్టులో పిటిషన్లు వేశారా? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా?’
– హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా పెదబయలు మండలం బురద మామిడిలో 2012లో ఇద్దరు ఆదివాసి రైతులను ఎన్కౌంటర్లో కాల్చి చంపడంపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరపాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. పౌర హక్కుల నేత ఎన్హెచ్ అక్బర్ 2012లో దీనిపై పిల్ దాఖలు చేశారు. ఘటనకు కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నక్సలైట్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని సమర్థిస్తూ పిల్ దాఖలు చేసినందుకు పిటిషనర్ను వివరణ కోరతామంది.